న్యూఢిల్లీ: పెద్ద చదువుల కోసం బ్యాంకుల్లో ఎడ్యుకేషన్ లోన్లు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వ బ్యాంకులు చాలా తక్కువ వడ్డీ తీసుకుంటున్నాయి. వీటిలో వడ్డీ 6.95 శాతం నుంచి 8.65 శాతం వరకు ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ల మార్కెట్లో స్టేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ముందు వరసలో ఉన్నాయి. ఇవి కూడా ఫ్లోటింగ్-రేటు రిటైల్ లోన్లు కాబట్టి అక్టోబర్ 1, 2019 తర్వాత బ్యాంకులు ఇచ్చిన అన్ని ఎడ్యుకేషనల్ లోన్లు ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేటుకు లింక్ అయి ఉంటాయి.
అంటే బ్యాంకులు ఆర్బీఐ రెపో రేటును బట్టి లోన్ల వడ్డీ రేటును మార్చుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది మే నుండి రేట్లను పెంచడం ప్రారంభించినప్పటి నుండి ఎడ్యుకేషనల్ లోన్లు ఖరీదయ్యాయి. సెంట్రల్ బ్యాంక్ అత్యధికంగా ఇప్పటి వరకు కీలకమైన పాలసీ రేటును 140 బేసిస్ పాయింట్లు పెంచింది. బారోవర్లు రాబోయే నెలల్లో మరింత ఎక్కువ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. బ్యాంక్బజార్ డాట్కామ్ డేటా ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికీ 8 శాతం కంటే తక్కువ వడ్డీనే వసూలు చేస్తున్నాయి.
ఇవి వసూలు చేసే వడ్డీరేట్లు ఇలా ఉన్నాయి..
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు ప్రస్తుతం అన్ని బ్యాంకుల కంటే తక్కువగా ఉంది. ఏడేళ్ల కాలపరిమితితో ఇది రూ. 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్కు ఇది ఏడాదికి 6.95 శాతం వడ్డీ తీసుకుంటుంది. ఇందుకు నెలవారీ వాయిదా మొత్తం రూ.30,136.
- ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ మేజర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో 7.45 శాతం వడ్డీ రేటు ఉంది. చౌకగా ఎడ్యుకేషన్ లోన్లు ఇస్తున్న బ్యాంకుల జాబితాలో రెండవ స్థానంలో ఉంది. నెలకు కిస్తీగా రూ. 30,627 చొప్పున ఏడేళ్లు కట్టాలి.
- మూడోస్థానంలో స్టేట్బ్యాంక్ ఉంది. ఇది ఎడ్యుకేషన్ లోన్లపై 7.5 శాతం వడ్డీ వేస్తుంది. కిస్తీ మొత్తం రూ. 30,677. మరో రెండు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు – యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్ – కూడా ఇదేవిధంగా వడ్డీ రేటును వసూలు చేస్తాయి.
- ఇండియన్ బ్యాంక్ ఏడేళ్ల కాలపరిమితితో రూ. 20 లక్షల ఎడ్యుకేషనల్ లోన్పై 7.9 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తోంది. బారోవర్ ఏడేళ్లపాటు నెలకు రూ.31,073 కిస్తీ చెల్లించాలి.
- ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకు ఆఫ్ఇండియాలో వడ్డీ 8.25 శాతం ఉంది. కిస్తీ మొత్తం రూ. 31,422 అవుతుంది.
- రూ.20 లక్షల ఎడ్యుకేషనల్ లోన్పై కెనరా బ్యాంక్ వడ్డీరేటు ఏడేళ్ల కాల పరిమితికి 8.3 శాతంగా ఉంది. ఈఎంఐ రూ.31,472గా ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎడ్యుకేషన్ లోన్లపై వడ్డీ 8.35 శాతం. కిస్తీ రూ. 31,522 చొప్పున ఉంటుంది.
- పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మరొక ప్రభుత్వ రంగ బ్యాంకు. నెలకు కిస్తీ మొత్తం రూ. 31,572 కాగా, 8.4 శాతం వడ్డీ కట్టాలి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 8.65 శాతం వడ్డీ ఉంది. రూ. 31,824 చొప్పున కిస్తీ చెల్లించాలి.
ఈ విషయాలు గుర్తుంచుకోవాలి...
పక్కన పేర్కొన్నవన్నీ స్టాక్ మార్కెట్లో లిస్టయిన ప్రభుత్వ బ్యాంకులు. 2022 ఆగస్టు 18 నాటికి సంబంధిత బ్యాంకుల వెబ్సైట్ల నుండి సేకరించిన డేటా ఇది. బ్యాంకుల వడ్డీ రేట్లను ఆరోహణ క్రమంలో ఇవ్వడం జరిగింది. అంటే, ఎడ్యుకేషనల్ లోన్పై అతి తక్కువ వడ్డీ రేటును అందించే బ్యాంకు (లోన్ మొత్తం కాలంతో సంబంధం లేకుండా) పైన ఉంటుంది. కింది వరుసలోని బ్యాంకు అత్యధిక రేటును ఆఫర్ చేస్తుందని అర్థం. కిస్తీ ఏడు సంవత్సరాల కాలపరిమితితో రూ. 20 లక్షలకు వడ్డీ రేట్ల ఆధారంగా లెక్కిస్తారు (కిస్తీ లెక్కింపు కోసం ప్రాసెసింగ్, ఇతర ఛార్జీలు సున్నాగా అని భావించడమైనది).