టీటీడీ (TTD) లో నూతనంగా కొలువైన పాలక మండలి సమావేశం జరిగింది. మంగళవారం (సెప్టెంబర్ 5) తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన పాలక మండలి సభ్యులతో తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలను పాలక మండలి సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై ప్రధానం చర్చ జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం పట్టు వస్త్రాల సమర్పణ ఏర్పాట్లపై చర్చించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని.. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యలను కల్పిస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు. 18వ తేదీ ప్రభుత్వం తరుపున సీఎం జగన్ (CM Jagan) స్వామి వారికి పట్టు వస్త్రాలని సమర్పిస్తారన్నారు. అదే రోజు 2024 డైరీ, క్యాలెండరులను సీఎం ఆవిష్కరిస్తారని తెలిపారు.
టీటీడీ పాలకమండలి నిర్ణయాలు ఇవే..
- రూ.2 కోట్లతో మూలస్థాన ఎల్లమ్మ ఆలయాన్ని ఆధునీకరణ
- రూ.47 వేద అధ్యాపకుల పోస్టులు మంజూరుకు ఆమోదం
- రూ.33 కోట్లతో టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయింపు
- 413 మంది అర్చకులు, పరిచారకులు, పోటు సిబ్బంది పోస్టులు మంజూరుకు ప్రతిపాదన
- పద్మావతి ఆస్పత్రిలో 300 మంది సిబ్బంది నియామకానికి ఆమోదం
- రూ.1.65 కోట్లతో ముంబాయిలో మరో ఆలయ నిర్మాణం
- రూ.2.46 కోట్లతో టీటీడీ అస్పత్రుల్లో మందుల కొనుగోలుకు ఆమోదం
- రూ.600కోట్ల రూపాయలతో గోవిందరాజ సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపాదం భవనాలను నిర్మాణం
- రూ.5.35 కోట్లతో సమాచార కేంద్రం నిర్మాణం. అయితే దీనిని పాలకమండలి సభ్యులే దీన్ని నిర్మిస్తారు
- రూ.49.5 కోట్లతో టీటీడీ క్వార్టర్స్ ఆధునీకరణ
- తిరుపతి రోడ్ల మర్మతులకు రూ.4 కోట్లు కేటాయింపు