కోపం ఎక్కువుగా ఉందా... అయితే ఇవి తినడం మానేయండి..

కోపం ఎక్కువుగా ఉందా... అయితే ఇవి తినడం మానేయండి..

కొంతమందికి కోపం ఎప్పుడూ ముక్కు మీదే ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. మనసుకు నచ్చని మాటలు విన్నా, నచ్చనివారిని చూసినా, నచ్చని పనులు చేసినా.. కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, అనారోగ్యం వంటివి కూడా కోపానికి కారణాలు. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా మనం తీసుకునే ఆహారాలు కూడా కోపాలకి కారణమవుతాయని.. ముఖ్యంగా ఈ ఫుడ్స్​ తింటే కోపం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్రస్తుతం చాలా మంది ప్రాసెస్డ్​ ఫుడ్స్​పై ఇంట్రస్ట్​ చూపిస్తున్నారు. కారణం ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ప్రాసెస్ చేసిన ఫుడ్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ప్రాసెస్ చేసిన ఆహారాలు లేదా ఫాస్ట్​ఫుడ్​లో ఎక్కువ మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మీ న్యూరోట్రాన్స్మిటర్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని.. మానసిక స్థితి, భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఫుడ్, ఫాస్ట్ ఫుడ్​ను రెగ్యులర్​గా తీసుకోవడం వల్ల మీ ఒంట్లో శక్తి తగ్గుతుందని.. కోపం కూడా పెరుగుతుందని అంటున్నారు.

కెఫెన్: చాలా మందికి ఉదయం ఓ కప్పు కాఫీతోనే డే స్టార్ట్​ అవుతుంది. అయితే కోపాన్ని పెంచే లిస్ట్​లో కెఫెన్ ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొన్ని కొన్ని సార్లు ఆందోళన, ఒత్తిడి, కోపం పెరగడం వంటి మానసిక సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా కెఫిన్​ను ఎక్కువగా తీసుకోకూడదని సూచిస్తున్నారు. 2016లో జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకియాట్రీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కెఫెన్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన, నిరాశ, కోపం, మానసికస్థితి రుగ్మతల వంటి సమస్యలు వస్తాయని కనుగొన్నారు. 

షుగర్ రిచ్ ఫుడ్స్​: షుగర్​ అధికంగా ఉండే ఆహారాలు కూడా కోపాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. క్యాండీలు, చాక్లెట్లు, కూల్​డ్రింక్స్​, స్వీట్లతో పాటుగా షుగర్​ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని.. ఇది మూడ్ స్వింగ్స్, చిరాకును కలిగిస్తుందని, కోపాన్ని పెంచుతాయని అంటున్నారు. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఆల్కహాల్: ఆల్కహాల్ కూడా కోపాన్ని మరింత పెంచుతుందని నిపుణులు అంటున్నారు. మందును ఎక్కువగా తాగేవారిలో కోపం, మానసిక సమస్యలు బాగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కారణం ఆల్కహాల్ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ల సమతుల్యతను దెబ్బతీస్తుందని అంటున్నారు. కాబట్టి మందు తాగే అలవాటును తగ్గించుకోమని సలహా ఇస్తున్నారు.

ఉప్పు: ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు, స్నాక్స్​ కోపాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. అధిక సోడియం.. శారీరక, మానసిక శ్రేయస్సు రెండింటిని ప్రభావితం చేసే అధిక రక్తపోటుకు దోహదం చేస్తుందని అంటున్నారు. అందుకే ఇలాంటి వారు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.