రామ మందిర నిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నరు : కాంగ్రెస్‌పై లక్ష్మణ్ ఫైర్‌‌

రామ మందిర నిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నరు : కాంగ్రెస్‌పై లక్ష్మణ్ ఫైర్‌‌

ముషీరాబాద్, వెలుగు: అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో దేశ ప్రజలందరూ భాగస్వామ్యమవుతుంటే.. కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా అడ్డుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌ ముషీరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని, మాట్లాడారు.

ప్రధాని మోదీ ఏజెండా, సంక్షేమ పథకాల వైపే దేశ ప్రజలు మొగ్గుచూపుతున్నారని, మరోసారి ఆయనను ప్రధానిగా గెలిపించడానికి రెడీగా ఉన్నారని పేర్కొన్నారు. మోదీ చేసిన అభివృద్ధిని జీర్ణించుకోలేక కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాయని మండిపడ్డారు. మోదీ మీద ఉన్న కోపం, ఆక్రోశం అంతా శ్రీరాముడిపై చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 500 ఏండ్ల చరిత్ర ఉన్న రామ మందిరాన్ని కట్టలేని కాంగ్రెస్.. మోదీ చేస్తున్న కార్యాన్ని సహించలేక అనవసర విమర్శలు చేస్తున్నారని ఫైర్‌‌ అయ్యారు.