
- బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
బషీర్బాగ్, వెలుగు: ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజాతీర్పుపై గౌరవం లేదని, వారు ప్రజా ప్రతినిధులుగా కొనసాగేందుకు అర్హత లేదని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని సీఎం రేవంత్రెడ్డి బయటపెడుతుంటే అది చూసి తట్టుకోలేకనే వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
బుధవారం గన్పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రగతిభవన్ కంచెలను నేలకూల్చి, దానికి ఫూలే ప్రజాభవన్గా పేరు పెట్టడంపై బీసీ సమాజం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. అవినీతి అధికారులను పక్కన పెడుతూ, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బీసీ విద్యార్థి నేతలు, ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.