టీమిండియాతో అహ్మదాబాద్లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ జట్టు ఓటమి పాలైంది. దీంతో టీమ్ సెలెక్షన్, రొటేషన్ పాలసీపై విమర్శలు వస్తున్నాయి. బంతి సుడులు తిరుగుతున్న ట్రాక్ మీద ఒకే స్పిన్నర్ను ఆడించడంపై ఇంగ్లండ్ వెటరన్ ప్లేయర్లు మండిపడుతున్నారు. ఇది తప్పుడు ఎంపిక అంటూ మాజీ ఇంగ్లండ్ బ్యాట్స్మన్ జెఫ్రీ బాయ్కాట్ కామెంట్ చేశాడు. సరైన టీమ్ను ఎంచుకోనందునే ఇంగ్లిష్ జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకుందన్నాడు.
‘టర్నింగ్ పిచ్ మీద ఇంగ్లండ్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను ఆడించడానికి కారణాలేంటో అర్థం కావడం లేదు. వాళ్లు అడిలైడ్లో పింక్ బాల్ టెస్టు ఆడుతున్నామని భ్రమించారు. కానీ మ్యాచ్ జరిగింది అహ్మదాబాద్లో’ అని బాయ్కాట్ చెప్పాడు. ఇక మ్యాచ్ రెండ్రోజుల్లో ముగియడం, స్పిన్ ట్రాక్ మీద విమర్శలు రావడంపై బాయ్కాట్ స్పందించాడు. ఫలానా పిచ్నే రూపొందించాలనే రూల్ లేదని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ కంటే ఇండియా మెరుగ్గా ఆడిందని మెచ్చుకున్నాడు.