- చితిలోంచి ఒక డెడ్ బాడీ పక్కన పడేసిన దుండగులు
- మరో చోట బూడిదను ఎత్తుకెళ్లిన్రు
- మృతుల నోటిలో పెట్టిన బంగారం, చెవి పోగుల కోసం ఘాతుకం
మెదక్/ చేగుంట, వెలుగు: మెదక్ జిల్లా చేగుంటలో చనిపోయిన వారి నోటిలో పెట్టిన బంగారం, చెవి పోగుల కోసం చితిలో నుంచి ఒక డెడ్ బాడీని పక్కన పడేయగా, మరో డెడ్ బాడీకి సంబంధించిన చితాభస్మాన్ని ఎత్తుకెళ్లారు. చేగుంటకు చెందిన కర్రె నాగమణి(70) శుక్రవారం చనిపోగా వైకుంఠధామంలో అంత్య క్రియలు నిర్వహించారు. శనివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు వైకుంఠధామానికి వెళ్లగా, చితిపై నీళ్లు పోసి సగం కాలిన డెడ్బాడీ పక్కన పడేసి కనిపించింది.
అక్కడే మూడు రోజుల కింద మురాడి నర్సమ్మ డెడ్బాడీని దహనం చేయగా తల భాగంలోని చితాభస్మాన్ని ఎత్తుకెళ్లారు. దుండగులు బంగారం కోసం డెడ్బాడీలను వదలక పోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో చేగుంట పోలీసులు విచారణ చేపట్టారు. దుండగులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
