- పొలం అమ్మగా వచ్చిన పైసలని బాధితురాలి ఆవేదన
గద్వాల, వెలుగు: పెద్దల పండుగకు ఊరెళ్తే గద్వాలలోని సంతోష్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకెళ్లారు. బాధితురాలు, గద్వాల టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ కథనం ప్రకారం.. గద్వాలకు చెందిన సునీత పెద్దల పండుగ ఉండడంతో తల్లిగారి ఊరైన వడ్డేపల్లి మండలం రామాపురానికి గత శుక్రవారం వెళ్లింది. గురువారం ఇంటికి రాగా, ఇంటికి వేరే తాళం వేసి ఉండడంతో పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి కనిపించింది.
దీంతో దొంగతనం జరిగిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు సునీత మాట్లాడుతూ పొలం అమ్మగా వచ్చిన రూ.14.50 లక్షలు, 10 తులాల బంగారం ఎత్తుకెళ్లారని విలపించింది. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.