రోజు రోజుకు దొంగలు దిగజారిపోతున్నారు. ఏది చోరీ చేయాలో..ఏది చోరీ చేయకూడదో అని కూడా తెలుసుకోలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్ అబిడ్స్ లో దొంగలు చిన్న కుక్కపిల్లను ఎత్తుకెళ్లారు. ఇంటిముందు కట్టేసిన కుక్కను ఇద్దరు దొంగలు తీసుకెళ్లారు.
హైదర్ గూడ భారత్ పెట్రోల్ పంప్ పక్క గల్లీలో నివాసం ఉండే ఓ యజమాని..కొన్ని రోజుల క్రితం లబ్రడోర్ బ్రీడ్ కుక్క పిల్లను రూ. 18 వేలకు కొనుగోలు చేశారు. అయితే జులై 12న ఇంటి గేటు ముందు కుక్కపిల్ల తిరుగుతుండగా.. ఆ మార్గంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు దాన్ని ఎత్తుకెళ్లిపోయారు. అయితే కుక్క కోసం బయట చూడగా కనిపించలేదు. దీంతో ఎక్కడికైనా వెళ్లిపోయిందేమో అనుకున్న యజమాని..పరిసరాలు వెతికాడు. ఎంతకీ ఆచూకి దొరక్కపోవడంతో సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించాడు. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కుక్క పిల్లను ఎత్తుకెళ్లినట్లు గ్రహించారు. దీనితో జులై 15వ తేదీ శనివారం యజమాని అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకుంటామని తెలిపారు.