దుర్గాష్టమి, మహర్నవమి రోజుల్లో ఇలా చేస్తే.. అదృష్టమేనట..

దుర్గాష్టమి, మహర్నవమి రోజుల్లో ఇలా చేస్తే.. అదృష్టమేనట..

దసరా నవరాత్రిళ్లు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.  దుర్గాష్టమి, మహర్నవమి రోజుల్లో  కొన్ని ముఖ్యమైన పనులు చేస్తే అదృష్ట లక్ష్మి మీ తలుపు తడుతుందని పురాణాలు చెబుతున్నాయి.  ఆదిశక్తి దుర్గాదేవికి సంబంధించిన శారదీయ నవరాత్రులు మరికొద్ది రోజుల్లో ముగియబోతున్నాయి. నవరాత్రులు అక్టోబర్ 15న ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 24న విజయదశమి అంటే దసరా పండుగను అన్ని చోట్లా జరుపుకోబోతున్నారు.

నవరాత్రి పండుగలో అష్టమి-, నవమి తిథులు చాలా ముఖ్యమైనవి. ఈ రెండు తిథులలో కొన్ని పరిహారాలు చేయడం వల్ల దుర్గామాత అనుగ్రహంతో జీవితంలోని బాధలు తొలగిపోతాయి.

Also Read :- శ్రీవారి భక్తులకు హైకోర్టు షాక్

 నవరాత్రులలో అష్టమి-, నవమి తిథి నాడు అమ్మవారిని పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. ఈ పూజ వల్ల దుర్గ మాత ప్రసన్నురాలయి భక్తులకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని చెబుతారు. సీతాదేవి అశోక వనంలో ఉన్నప్పుడు  దసరా నవరాత్రిళ్ల సమయంలో అమ్మవారికి అర్చించిందని.. అప్పుడే శ్రీరామచంద్రుడు .. రావణాసురుడిని అంతమొందించాడని దేవీ భాగవతంలో ఉందని పండితులు చెబుతున్నారు. 

అష్టమి, నవమి రోజున మీ శక్తి మేరకు పేదలకు దానధర్మాలు చేయాలి. ఈ రెండు తిథులలో మీరు అవసరమైన వారికి ఆహార ధాన్యాలు, బట్టలు, డబ్బు ఇవ్వవచ్చు. దానధర్మాలు చేయడం ద్వారా అమ్మ ప్రసన్నురాలై భక్తుల కోరికలు తీరుస్తుంది.

నవరాత్రి ఉత్సవాల్లో  చివరి రోజు అంటే నవమి నాడు కుంకుమ, గాజులు, కాటుక, తదితర వస్తువులను దానం చేయడం శుభప్రదం.

నవరాత్రులలో అష్టమి, నవమి తిథిలలో దుర్గా మాతకు నీరు సమర్పించడం ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. ఈ రోజున అత్తరు కలిపిన సువాసన గల నీటితో దుర్గా దేవికి జలాభిషేకం చేయాలి.

నవరాత్రులలో అష్టమి-నవమి తిథులలో మహిషాసుర మర్దిని లేదా దుర్గా సప్తశతి భక్తి ప్రపత్తులతో చదవాలి. ఇలా పారాయణం చేయడం వల్ల దుర్గాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది.

అష్టమి, నవమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, ఇంట్లోని అరిష్టాలు తొలగిపోతాయని నమ్మకం.