తెలంగాణలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ చేసిన ప్రతిపాదనలకు సర్కారు ఆమోదం తెలిపింది. 2022లో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకు కుదించి ప్రభుత్వం టెన్త్ పరీక్షలు నిర్వహించగా, 2023లోనూ 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా విద్యార్థులపై భారం పడకుండా 2021–2022 విద్యా సంవత్సరంలో టెన్త్ పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించారు. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని చాలావరకు తగ్గించింది. గతంలో తెలుగు, ఇంగ్లీష్, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులను రెండు పేపర్లుగా పరీక్ష నిర్వహించేవారు. హిందీ సబ్జెక్ట్కు ఒకే పరీక్ష ఉండేది. ఇప్పుడు ఆరు సబ్జెక్టులకు చెరో పేపర్ మాత్రమే ఉంటుంది.