భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డు పై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ అవార్డును దేశంలోని రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నానని చెప్పారు. అమృత కాలం దిశగా భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు. ప్రస్తుత తరుణంలో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నానని చెప్పారు.
ఈ పురస్కారం తన బాధ్యతను మరింతగా పెంచిందని వెంకయ్య నాయుడు చెప్పారు. నవభారత నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. శక్తివంతమైన, ఆత్మనిర్భర భారత నిర్మాణానికి ప్రజలతో కలసి నడుస్తానని వెంకయ్య నాయుడు చెప్పారు.