ఇది జస్ట్ ట్రైలర్.. అసలు సినిమా ముందుంది

ఇది జస్ట్ ట్రైలర్.. అసలు సినిమా ముందుంది

రాంచీఅవినీతి, టెర్రరిజాన్ని అంతం చేయడంతోపాటు అభివృద్ధిని పరుగులు పెట్టించడమే ఎన్డీఏ సర్కారు లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.  రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్ని విజయవంతంగా కొనసాగించడం దగ్గర్నుంచి ట్రిపుల్​ తలాక్​ రద్దు, జమ్మూకాశ్మీర్​ విభజన లాంటి కీలక నిర్ణయాలెన్నో తీసుకున్నామన్నారు. రెండో టర్మ్​ 100 రోజుల పాలన కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని, రాబోయే రోజుల్లో దేశంలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయని ప్రధాని చెప్పారు. జార్ఖండ్​ రాజధాని రాంచీలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అవినీతిపై ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తున్నందుకే అక్రమార్కులు జైలుపాలవుతున్నారని, ఇంకొంత మంది బెయిల్​పై బతుకుతున్నారని పరోక్షంగా కాంగ్రెస్​ నేతలపై మోడీ విమర్శలు చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామన్న ప్రధాని.. ఇదేవేదికపైనుంచి పలు పథకాల్ని ప్రారంభించారు. దేశంలో 60 ఏండ్లు నిండిన ప్రతి రైతులకు నెలనెలా రూ.3వేలు అందించే ‘‘ప్రధానమంత్రి కిసాన్​ మాన్​ ధన్​ యోజన’’, 60 ఏండ్లు నిండిన షాప్​ కీపర్లు, రిటైల్​ దుకాణం దారులకు నెలకు మూడు వేలు అందించే ‘‘ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్​ ధన్​ యోజన’’, సెల్ఫ్ ​ఎంప్లాయిమెంట్ పొందుతోన్న యువకుల కోసం రూపొందించిన ‘‘స్వరోజ్​గార్​ పెన్షన్​ స్కీం”లబ్ధిదారులకు మోడీ సర్టిఫికేట్లు అందజేశారు.

19ఏండ్లకు సొంత అసెంబ్లీ.. అదీ పేపర్​లెస్

బీహార్ నుంచి విడిపోయిన 19 ఏండ్ల తర్వాత జార్ఖండ్ సొంతగా అసెంబ్లీ బిల్డింగ్ ఏర్పాటుచేసుకుంది. దేశంలోనే తొలి పేపర్​లెస్​ అసెంబ్లీగా రికార్డులకెక్కిన ఈ బిల్డింగ్​ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇన్నాళ్లూ రాంచీ సిటీలోని ఇండస్ట్రియల్​ ఏరియాలోని లెనిన్​ హాలునే అసెంబ్లీగా వాడుకున్నారు. సిటీ శివారులోని కుంటేగ్రామ్​లో 39 ఎకరాల సువిశాల స్థలంలో రూ.465 కోట్లతో కొత్త అసెంబ్లీని నిర్మించారు. ఈ బిల్డింగ్​కు 40 శాతం సోలార్​  కరెంటే. కొత్త బిల్డింగ్​ ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం అసెంబ్లీ ఒకరోజుపాటు సమావేశం కానుంది. 81 స్థానాలున్న జార్ఖండ్​ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగుతాయి. కొత్త అసెంబ్లీతోపాటు సాహిబ్​గంజ్​ వద్ద నిర్మించిన కార్గో టెర్మినల్​ను కూడా మోడీ ప్రారంభించారు. గంగానదిలో జలరవాణా కోసం నిర్మించిన రెండో పెద్ద టెర్మినల్​ ఇది. మొదటిది టెర్మినల్​ను వారణాసిలో నిర్మించారు.