వ్యవసాయ కుటుంబంలో పుట్టి, పెరిగాడు జిన్న బాలు.పెద్దయ్యాక తండ్రిలా తను కూడా రైతు అవ్వాలనుకున్నాడు. కానీ, తల్లిదండ్రులు మాత్రం పెద్ద ఆఫీసరుగా చూడాలనుకున్నారు. వాళ్లు ఆశపడ్డట్టే ఇంజినీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు బాలు. మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఐదంకెల జీతంతో జాబ్ తెచ్చుకున్నాడు. అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న టైంలో తన ఫ్రెండ్కి క్యాన్సర్ అని ఫోన్ వచ్చింది. కెమికల్స్తో నిండిన ఫుడ్ తినడం వల్లే ఫ్రెండ్కి క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. ఆ నిమిషం తన ఫ్రెండ్లా మరొకరు ఇబ్బంది పడకూడదనుకున్నాడు. అందుకోసం కెమికల్స్ లేని వ్యవసాయం చేయాలనుకున్నాడు. రీసెర్చ్ మొదలుపెట్టాడు. పాలేకర్ పద్ధతిలో కెమికల్స్ వాడకుండా ఒక్క ఆవువల్ల లభించే సహజ ఎరువుతో30 ఎకరాల భూమి సాగు చేయొచ్చని తెలుసుకున్నాడు. ఆ పద్ధతిలోనే తన పద్నాలుగు ఎకరాల్లో ఐదేళ్ల నుంచి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాడు. ఒక పక్క వర్క్ ఫ్రమ్ హోం ద్వారా ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తూనే తన తమ్ముళ్లు రాజు, కృష్ణలతో కలిసి సాగు చేస్తున్నాడు
చెరుకుతో మొదలుపెట్టి..
పాలేకర్ పద్ధతిలో మొదట చెరుకు సాగు చేశారు ఈ అన్నదమ్ములు. ఆశించిన దానికంటే రెండింతలు ఎక్కువ లాభం వచ్చింది. దాంతో అదే పద్ధతిలో వరి సాగు చేయడం మొదలుపెట్టారు. పన్నెండు ఆవులు పెంచుతూ వాటి మూత్రం, పేడతో పాటు బెల్లం, శెనగ, ఉలవ, పెసర, మినుముల పిండి, చెరుకు రసం, తాటి పండ్ల గుజ్జు, పుట్ట మట్టితో జీవామృతం తయారుచేస్తున్నారు. చెట్ల ఆకులతో తయారుచేసిన నీమాస్త్రం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్నికషాయాల్ని పంటలకి పిచికారి చేస్తున్నారు.
టెక్నాలజీ సాయంతో
ఈ యంగ్ రైతు టెక్నాలజీ సాయంతో మేలైన దేశవాళీ రకాల వరి విత్తనాలు ఎక్కడ? ఎవరి దగ్గర దొరుకుతున్నాయి? అని తెలుసుకుంటున్నాడు. విత్తన మార్పిడి ద్వారా ఆయా రకాల వరి విత్తనాల్ని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నాడు. కరుతక్కర్, జాస్మిన్ బాస్మతి, చిన్నార్, సిరుమని సాంబ, సీరంగ సాంబ, సోనా మసూరి, ఫేజియా, బాలభట్ ఎరుపు, దేశీ కోలం, చీర్లా తెలుపు, మణిపురి బ్లాక్, రక్తశాలి వంటి 118 రకాల వరి విత్తనాలతో కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడు. ఈ విత్తనాల్ని భవిష్యత్తు తరాలకి పరిచయం చేయాలి అంటున్నాడు. అలాగే తన పొలంలో మైసూర్ మల్లిక, మాప్లై సాంబ, కాలా బట్, కర్సుకోని, కృష్ణవ్రిహి, బర్మా బ్లాక్, చెకోవా, రెడ్ రైస్, రక్తశాలి, నవారా రకాల వరి సాగు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. టి. శ్రీధర్, మెదక్, వెలుగు ఆకుల భాస్కర్
అది చాలు
అన్న సజెషన్తో ఒకసారి సుభాష్ పాలేకర్ సదస్సుకి వెళ్లా. అక్కడ నేచురల్ ఫార్మింగ్ గురించి వివరంగా తెలుసుకున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం ఎంత అవసరమో కూడా అర్థం చేసుకున్నా. అప్పట్నించీ అన్నతో కలిసి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నా.. మమ్మల్ని చూసి ప్రకృతి వ్యవసాయం వైపు ఒక్కరు నడిచినా చాలు.
- జిన్న రాజు
ఫ్యూచర్ జనరేషన్స్ కోసం..
కెమికల్స్తో నిండిన మందుల వల్ల పంటతో పాటు నేల, నీరు, గాలి కలుషితం అవుతోంది. దానివల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలకి పరిష్కారంగానే ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నా. ఫ్యూచర్ జనరేషన్స్కి ఆరోగ్యవంతమైన నేల, విత్తనం, ఫుడ్ అందించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నా. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు సిటీల నుంచి కూడా చాలా మంది మా పొలాన్ని చూడ్డానికి వస్తున్నారు.
- జిన్న బాలు