
చిన్న చిన్న మార్పు లు చేస్తం
న్యూఢిల్లీ, లక్నో, గ్వాలియర్: రాముడి గుడి కోసం విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) సిద్ధం చేసిన మోడల్కు కొన్ని మార్పులు చేయాలని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. ఈ మోడల్ ప్రకారం కాకుండా గుడి ఎత్తును ఇంకాస్త పెంచనుంది. మోడల్లో గుడి ఎత్తు 125 ఫీట్లుగా పేర్కొనగా.. దీనిని 160 ఫీట్లకు పెంచాలని, అదనంగా మూడో ఫ్లోర్ను కూడా కట్టాలని ట్రస్టు నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం ట్రస్టు సభ్యులు చంపత్ రాయ్, విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా, అనిల్ మిశ్రాలు కన్స్ట్రక్షన్ కమిటీ హెడ్ నృపేంద్ర మిశ్రాను కలుసుకున్నారు. టెంపుల్ నిర్మాణ ప్రతిపాదనలపై ఈ సందర్భంగా చర్చించారు. టెంపుల్ మోడల్ను ఫైనల్ చేయడానికి ముందు ఎక్స్పర్ట్స్తో చర్చించనున్నట్లు నృపేంద్ర మిశ్రా చెప్పారని ట్రస్టు సభ్యుడు ఒకరు వెల్లడించారు. నిపుణులతో పాటు వివిధ గ్రూపులను సంప్రదించి, అందరికీ ఆమోదయోగ్యమైన మోడల్ను ఎంపిక చేస్తామని, నిర్మాణ పనులు అన్నింటికీ సంబంధించి ప్లానింగ్ సిద్ధం చేస్తామని చెప్పారు. నిర్మాణ పనులు ఆరునెలల్లో మొదలుపెడతామని ట్రస్టు ప్రెసిడెంట్ నృత్య గోపాల్ దాస్ చెప్పారు.
మోడల్ అదే.. చిన్న మార్పులు
రామ జన్మభూమిలో గుడి కట్టేందుకు విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) ముప్పై ఏళ్ల క్రితమే నమూనా సిద్ధం చేసింది. పలు సందర్భాలలో ఈ మోడల్ను వివిధ వేదికలపై ప్రదర్శించింది. ఎప్పటికైనా ఈ మోడల్ ప్రకారమే గుడి నిర్మాణం జరుగుతుందని చెబుతూ వస్తోంది. టెంపుల్ ట్రస్ట్ ఏర్పాటయ్యాక కూడా ఈ మోడల్లోనే గుడి కడతారని ఆశిస్తున్నట్లు వీహెచ్పీ పేర్కొంది. ఇదే విషయాన్ని ట్రస్టు సభ్యుడు స్వామి గోవింద్ దేవ్ గిరి కూడా స్పష్టంచేశారు. వీహెచ్పీ మోడల్ ప్రకారమే గుడి నిర్మాణం జరుగుతుందని, అయితే, కొన్ని మార్పులు చేయాలని ట్రస్టు నిర్ణయించిందని చెప్పారు.
గుడి నిర్మాణంలో గొడవలొద్దు: మోడీ
రామ మందిర నిర్మాణ పనులు శాంతియుతంగా, ఎలాంటి గొడవలు లేకుండా జరగాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ వివరించారు. ఈమేరకు శుక్రవారం ట్రస్ట్ ప్రెసిడెంట్నృత్య గోపాల్ దాస్, ముగ్గురు సభ్యులు ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. రామ మందిరం భూమి పూజకు రావాలని మోడీని ఆహ్వానించారు.
నిర్మాణ పనులపై చర్చిస్తూ.. పనులను శాంతియుతంగా జరిపించాలని ప్రధాని సూచించినట్లు ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థకు బూస్ట్..: ప్రహ్లాద్ పటేల్
అయోధ్యలో కట్టబోయే రామ మందిరం ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ అన్నారు. టూరిస్టులను ఆకర్షించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ డెవలప్మెంట్కు తోడ్పడుతుందని చెప్పారు. గుడి నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసేందుకు కేంద్రంతో పాటు యూపీ సర్కారు కూడా కట్టుబడి ఉందన్నారు. 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకోవడానికి టూరిస్ట్ గైడ్స్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.
ఆల్టర్నేటివ్ ప్లేస్ మాకు ఓకే: వక్ఫ్బోర్డు
‘వివాదాస్పద స్థలం విషయంలో సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని మొదటి నుంచీ చెబుతున్నం.. తీర్పు ప్రకారం ప్రభుత్వం ఇచ్చే ఐదెకరాల ల్యాండ్ను వద్దనే చాయిస్ మాకు లేదు’ అని యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ సభ్యుడు ఫరూఖీ చెప్పారు. ఆల్టర్నేటివ్ ల్యాండ్ను వద్దనడం కోర్టు ధిక్కారం అవుతుందన్నారు. అయితే, ప్రభుత్వం ఇచ్చే ఆ ల్యాండ్ను ఎలా ఉపయోగించాలనే విషయంలో బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ విషయంపై సోమవారం జరిగే బోర్డు సమావేశంలో చర్చిస్తామని ఫరూఖీ తెలిపారు.