
మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు సకాలంలో మంజూరు చేయకపోవడంతోనే అక్కన్నపేట–మెదక్ రైల్వేలైన్ పనులు ఏండ్ల తరబడి ఆలస్యమయ్యాయని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. సోమవారం మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి మెదక్ రైల్వే స్టేషన్ లో రేక్ పాయింట్ను ప్రారంభించి వెళ్లిన తర్వాత బీజేపీ నాయకులతో ఆయన అక్కడికి వచ్చి పీఎం నరేంద్ర మోడీ, కేంద్ర మాజీ సహాయ మంత్రి దత్తాత్రేయ, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి, దివంగత ఆలె నరేంద్రల ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో రైల్వే సాధన సమితి ఉద్యమంతో పాటు, మాజీ ఎంపీలు నరేంద్ర, విజయశాంతి కృషి, దత్తాత్రేయ సహకారంతోనే రైల్వేలైన్కు ఆమోదం లభించిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే రాష్ట్ర వాటాగా 50 శాతం నిధులు భరించేందుకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రజాతినిధులు మెదక్ కు రైల్వేలైన్ తమ కృషి ఫలితమే అని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే మెదక్ నుంచి మిర్జాపల్లి, పటాన్ చెరుకు లింక్ లైన్, మెదక్ లో రైల్వే టెర్మినల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రసాద్, జనార్దన్, శివ, రాజేందర్, అశ్విని, వీణ, రైల్వే సాధన సమితి నాయకులు పాల్గొన్నారు.