వనపర్తి, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పాడిపశువులకు కౌ ఫాక్స్ సోకుతోంది. లంపి చర్మ వ్యాధిగా చెప్పే ఈ రోగం జిల్లాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. మొదట్లో రాయలసీమలో కనిపించింది. అక్కడి నుంచి మన రాష్ట్రంలో అతిపెద్ద పెబ్బేరు పశువుల సంత నుంచి వివిధ జిల్లాలకు వ్యాపించింది. వనపర్తి జిల్లాలోనే 3 వేలకు పైగా పశువులు ఈ వ్యాధి బారినపడగా, గడిచిన నెల వ్యవధిలో 120 చనిపోయాయి. ఈ రోగానికి మందు లేదనీ, ముందు జాగ్రత్తగా గోట్ఫాక్స్ వాక్సిన్ ఇస్తే పశువులను కాపాడుకోవచ్చని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు.
ఏమిటీ వ్యాధి..
ఆవులు, ఎడ్లు, బర్లకు సోకుతున్న కౌఫాక్స్ ఒక అంటువ్యాధి. లోకల్గా లంపి చర్మవ్యాధి అంటారు. ఇది సోకిన పశువులకు ముందుగా జ్వరం, నొప్పులతో పాటు చర్మంపై బుడిపెలు వస్తాయి. మెడవాపు, గంగడోలు వాపు కనిపిస్తాయి. చర్మం కింద ఏర్పడిన బుడిపెలు క్రమంగా పుండ్లుగా మారి మరణిస్తాయి. పెద్దవాటికంటే లేగ దూడల్లో డెత్రేట్ ఎక్కువగా ఉంటోంది. వ్యాధి సోకిన పశువును కుట్టిన ఈగలు, దోమలు ఇతర పశువును కుట్టినప్పుడు వ్యాధి వ్యాప్తి చెందుతోంది. వ్యాధిసోకిన పశువు లాలాజలంతో కలుషితమైన మేత, నీరు ద్వారా కూడా ఈ వ్యాధి మిగతా పశువులకు సోకుతుంది.
ఎలా వచ్చిందంటే..
ఈ వ్యాధి మొదట ఒడిశాలో కనిపించింది. ఆ తర్వాత బీహార్, వెస్ట్ బెంగాల్ మీదుగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చేరింది. అక్కడి నుంచి రాయలసీమ జిల్లాలకు, అటు నుంచి తెలంగాణకు వ్యాపించిందని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధిని అరికట్టేమందు లేదని, ముందు జాగ్రత్తగా పశువులకు టీకాలు ఇస్తున్నామని అంటున్నారు. ముఖ్యంగా ఒంగోలు జాతి పశువులు ఈ వ్యాధిని తట్టుకోవడం లేదు. ఇవి మరణించడం వల్ల ఒక్కో రైతుకు లక్షల్లో నష్టం జరుగుతోంది. పాడి ఉత్పత్తులపైనా ప్రభావం పడుతోంది. దీంతో పశుసంవర్థక ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. రైతులకు ఎక్కడికక్కడ అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు.
ఇలా చేయాలి
కౌ ఫాక్స్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆ పశువులను మంద నుంచి వేరుచేసి, వెంటనే వెటర్నరీ డాక్టర్లను సంప్రదించాలి. -యాంటీ బయాటిక్ మందులతో పాటు జ్వరం, నొప్పుల నివారణకు సూదులు వేయించాలి. ప్రాథమికంగా గోట్ఫాక్స్వ్యాక్సిన్ వేస్తే కొంత మేలు జరుగుతుంది. పశువులపై కీటకాలు, పురుగులు, దోమలు వాలకుండా వేపాకుతో తరుచూ పొగ వేయాలి. వీలైతే దోమతెరలు వాడాలి.
డాక్టర్లు పట్టించుకుంటలేరు
మా ఊర్లో పశువులన్నింటికీ కౌఫాక్స్వచ్చింది. లక్షలు పెట్టి కొన్న ఎడ్లు, ఆవులు చచ్చిపోతుంటే డాక్టర్లు ఎవ్వరూ పట్టించుకుంటలేరు. ఫోన్ చేస్తే ఇప్పుడొస్తం.. అప్పుడొస్తం అంటున్నరు తప్ప రావట్లేదు. ప్రైవేట్ డాక్టర్ల వద్దకు పోతే వేలకు వేలు గుంజుతన్రు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి ఈ వ్యాధి నుంచి మా పశువులను కాపాడాలి.
– నాగన్న, రైతు, బుసిరెడ్డిపల్లి, పాన్ గల్ మండలం, వనపర్తి జిల్లా
జాగ్రత్తలు తీసుకోవాలి
పాలమూరు లాంటి జిల్లాలో పశువులకు ఇలాంటి వ్యాధి రావడం ఇదే మొదటిసారి. ఈ రోగానికి ఎలాంటి మందు లేదు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు చెబుతున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోట్ఫాక్స్ టీకాలు ఇస్తున్నాం. ఈ టీకాల ద్వారా పశువుల పరిస్థితి కొంత మెరుగుపడుతోంది.
‑ వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పశువైద్య, సంవర్థకశాఖ అధికారి, వనపర్తి