
కాపాడమంటూ ప్రధాని మోడీ, సీఎం యోగి లకు లేఖ
సామాన్య మహిళలతో పాటు సమాజంలో ఓ హోదా ఉన్న మహిళలకు కూడా తమ భర్తల నుంచి వేధింపులు తప్పట్లేదు. మామూలు జనాలైతే పీఎస్ లో ఫిర్యాదు చేసి, న్యాయం చేయాల్సిందిగా కోరతారు. అదే అధికారం, న్యాయం చెప్పాల్సిన వాళ్లే ఈ వేధింపులకు పాల్పడితే.? ఉత్తర్ ప్రదేశ్ లో అలా జరిగిన సంఘటనే ఇప్పుడు సంచలనమైంది. ఓ మంత్రి భార్య “ తన భర్త తనను విడాకుల కోసం హింసిస్తున్నాడంటూ“ ప్రధాని మోడీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ కు లెటర్ రాసింది
యూపీకి చెందిన మంత్రి బాబురాం నిషాద్.. తన భార్య నీతూ నిషాద్ ను చిత్రహింసలు పెడుతున్నారనేది ఆ లెటర్ లోని సారాంశం. తన భర్త డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయాలని, చేయకుంటే చంపుతానని రివాల్వర్ చూపించి భయపెడుతున్నాడని బాబురాం భార్య నీతూ తన లేఖలో పేర్కొంది. బాబురాం నుంచి ఇదివరకే ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని, ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారేమి పట్టించుకోలేదని ఆమె వాపోయారు.
మంత్రి బెదిరింపులు వల్ల పోలీసులు కూడా తన విషయంలో జోక్యం చేసుకోలేదని ఆమె అన్నారు. మంత్రి పదవి అడ్డుపెట్టుకొని చాలా రకాలుగా వేధించేవాడని, గొడవకు పరిష్కారం ఆలోచించకుండా శారీరకంగా హింసించేవాడని ఆమె తెలిపింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలా భార్యపైనే తుపాకీ చూపించి బెదిరించడం ఎంత వరకూ కరెక్టని ఆమె ప్రశ్నించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఈ లెటర్ రాసినట్టుగా నీతూ నిషాద్ మీడియాకి తెలిపారు.