జయరాం హత్యకేసు.. సాక్ష్యం చెప్తే చంపేస్తానంటూ బెదిరింపు

జయరాం హత్యకేసు.. సాక్ష్యం చెప్తే చంపేస్తానంటూ బెదిరింపు
  • సాక్ష్యం చెప్తే చంపేస్తం
  • జైలు నుంచే సాక్షికి వాట్సాప్​ ద్వారా నిందితుడి బెదిరింపు

హైదరాబాద్‌‌, వెలుగు: జూబ్లీహిల్స్‌‌ పీఎస్‌‌ పరిధిలో 2019లో జరిగిన ఎన్‌‌ఆర్‌‌‌‌ఐ జయరాం హత్య కేసు మలుపు తిరుగుతోంది. ఈ కేసులో చంచల్​గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రధాన నిందితుడు రాకేశ్​రెడ్డి తన గ్యాంగ్​ద్వారా.. ప్రధాన సాక్షి, పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ను బెదిరించారు. వచ్చే  ఏడాది జూన్​9లోగా చంపేస్తామని వార్నింగ్​ఇవ్వడం కలకలం రేపుతోంది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన చందానగర్‌‌‌‌, రాజేంద్రనగర్‌‌‌‌, జూబ్లీహిల్స్‌‌ పోలీసులు బెదిరింపు లెటర్స్, వాట్సాప్‌‌ వివరాల ఆధారంగా మంగళవారం రాకేశ్​రెడ్డి గ్యాంగ్​లో ముగ్గురిని అరెస్ట్‌‌ చేశారు. నిందితుల నుంచి 5 బెదిరింపు లెటర్స్‌‌, 5 సెల్‌‌ఫోన్స్‌‌ స్వాధీనం చేసుకున్నారు. రాకేశ్ రెడ్డి చంచల్‌‌గూడ  జైలు నుంచే బెదిరింపులకు స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు.

అసలు ఏం జరిగిందంటే..

జూబ్లీహిల్స్‌‌ పీఎస్‌‌ లిమిట్స్​లో 2019 జనవరి 31న ఎన్‌‌ఆర్‌‌‌‌ఐ జయరాం దారుణ హత్యకు గురయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిగా రాకేశ్​రెడ్డిని అరెస్ట్​చేశారు. ప్రస్తుతం అతను చంచల్‌‌గూడ జైలులో రిమాండ్‌‌ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసులో నాలుగు నెలల క్రితం నాంపల్లి కోర్టులో ట్రయల్‌‌ ప్రారంభమైంది. జయరాం మేనకోడలు శ్రీఖా చౌదరి ప్రధాన సాక్షిగా కోర్టుకు హాజరవుతున్నారు. గత నెల 27న సాక్ష్యం చెప్పేందుకు ఆమె నాంపల్లి  కోర్టుకు వెళ్లారు. అదే సమయంలో కోర్ట్‌‌ హాల్‌‌ ముందు ఉన్న రాకేశ్​రెడ్డితో పాటు  మరో ముగ్గురు శ్రీఖా చౌదరిని బెదిరించారు. కోర్టులో సాక్ష్యం చెప్తే చంపేస్తామని బెదిరించారు. చెప్పినట్లు వినకపోతే వచ్చే ఏడాది జూన్‌‌ 9 లోపు జయరాం ఉన్న ప్లేస్‌‌కి పంపిస్తామని హెచ్చరించారు. ఈ నెల13న నాలుగు బెదిరింపు లెటర్స్‌‌ను  వాట్సాప్‌‌ ద్వారా ఆమెకు పోస్ట్‌‌ చేశారు. ఏప్రిల్‌‌ నుంచి  జూన్‌‌ లోపు కచ్చితంగా చంపేస్తామని బెదిరించారు. దీంతో ఈ నెల 16న శ్రీఖా చౌదరి చందానగర్‌‌‌‌ పోలీసులకు  ఫిర్యాదు చేశారు.

చంచల్‌‌గూడ జైలు నుంచే స్కెచ్

చంచల్‌‌గూడ జైలులో మేల్‌‌నర్స్‌‌గా పనిచేస్తున్న మహ్మద్‌‌ అక్బర్‌‌‌‌ అలీ(35)ని రాకేశ్​రెడ్డి పరిచయం చేసుకున్నాడు. తాను చెప్పినట్లు చేస్తే రూ.5 లక్షలు ఇస్తానన్నాడు. మాదాపూర్‌‌‌‌ కాకతీయ హిల్స్‌‌కి చెందిన తన రియల్‌‌ ఎస్టేట్‌‌ పార్ట్‌‌నర్‌‌ కూరపాటి మంగయ్య గుప్త(58)కు ములాఖత్‌‌లో ఈ విషయం చెప్పాడు. దీంతో మంగయ్య గుప్త.. ఈస్ట్‌‌ గోదావరి జిల్లా కుప్పన్‌‌పుడికి చెందిన కత్తుల శ్రీనివాస్​(38) పేరుతో మొబైల్‌‌ ఫోన్‌‌, సిమ్ కార్డ్‌‌ కొనుగోలు చేశారు. ములాఖత్‌‌కి వచ్చిన సమయంలో అక్బర్‌‌‌‌ అలీకి సెల్‌‌ఫోన్‌‌ అందించారు. ఇలా రాకేశ్​రెడ్డి జైలులోనే బెదిరింపు లెటర్స్‌‌ రాసి శ్రీఖాచౌదరికి పోస్ట్‌‌ చేశాడు. రాజేంద్రనగర్‌‌‌‌, చందానగర్‌‌‌‌లో నమోదైన కేసులతో పాటు జూబ్లీహిల్స్‌‌ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఫోన్‌‌ నంబర్‌‌‌‌ ఆధారంగా దర్యాప్తు చేశారు. అక్బర్‌‌‌‌ అలీతో పాటు మంగయ్య గుప్త, కత్తుల శ్రీనివాస్‌‌లను అరెస్ట్‌‌ చేసినట్లు సీపీ అంజనీ కుమార్‌‌‌‌ తెలిపారు.