మూన్నాళ్ల  ముచ్చటగా ఐటీ జాబ్​

మూన్నాళ్ల  ముచ్చటగా ఐటీ జాబ్​
  • టెర్మినేషన్​ చేస్తామని ఎమోషనల్ ​బ్లాక్​ మెయిల్​
  • వర్క్​ఫ్రం హోం పేరిట పని ఒత్తిడి
  • హెచ్ఆర్ మీటింగ్ అని రిజైన్ లెటర్ పై సంతకం
  • ఏడాదిలో ఊడిన ఉద్యోగాలెన్నో
  • లీవ్ ​పాలసీ విధానంపై హైకోర్టులో ఉద్యోగుల పిల్

నగరంలోని పలు ఐటీ కంపెనీల్లో ప్రస్తుతం 6 లక్షల మంది పనిచేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో కొత్త కంపెనీలు వస్తున్నాయి. విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఐటీ ఎగుమతుల్లో దూసుకుపోతున్నామని ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేస్తున్నారు కానీ కంపెనీల ఆగడాలను కట్టడి చేయడం లేదు. పెట్టుబడులు తీసుకువచ్చే క్రమంలో మితిమీరిన మినహాయింపులు, చట్టాల్లో సడలింపులతో వేధింపులు పెరిగాయని ఉద్యోగులు వాపోతున్నారు. అద్భుత అవకాశంగా భావించే సాఫ్ట్​వేర్​ జాబ్ ​ప్రస్తుతం కష్టాలపాలు చేస్తోంది. ప్రతి కంపెనీలో ఏదోఒక విధంగా టెక్కీల ఉద్యోగాలు ఊడుతున్నాయి. టెర్మినేషన్ లేదా బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఫ్యూచర్​పై దెబ్బకొడతామంటూ కొన్ని పలు కంపెనీలు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా బలవంతంగా రిజైన్లు చేయిస్తున్నాయి. ఏడాది కాలంగా దాదాపు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించిన కంపెనీలు పదుల సంఖ్యలో ఉంటాయని ఐటీరంగ నిపుణులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగులను తొలగించాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. లేబర్ డిపార్ట్​మెంట్​ని సంప్రదించి ఉద్యోగులకు ముందస్తు నోటీసులు జారీ చేయాలి. దాదాపు 3 నుంచి 6 నెలల జీతాన్ని చెల్లిస్తున్నట్టు హామీ ఇవ్వాలి. ఇలాంటి అదనపు భారాన్ని భరించలేక కంపెనీలన్నీ గుట్టుచప్పుడు కాకుండా తొలగిస్తున్నాయి.

వర్క్ ఫ్రం హోం చేయాల్సిందే

చాలా కంపెనీలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6  గంటల దాకా పనిచేయిస్తున్నాయి. మళ్లీ ఇంటికి బయలుదేరే లోపే మెయిల్ పంపించి సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 11 దాకా  వర్క్​ టు హోం చేయిస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిమితికి మించిన పనిగంటలు, ఓవర్ నైట్ డ్యూటీలు చేయాలని పలు కంపెనీలు కండిషన్ పెడుతున్నాయని చెబుతున్నారు. ఇల్లీగల్ లే ఆఫ్, ఫోర్సుడ్ రిజిగ్నేషన్లను పట్టించుకునే యంత్రాంగం లేదు. షాప్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టు, ఇండస్ట్రీయల్ డిస్ఫ్యూట్ యాక్టు వంటివి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి మినహాయింపులిచ్చింది. పెట్టుబడులు తీసుకువచ్చే క్రమంలో తొలుత కంపెనీలను ప్రోత్సహించిన చట్టాలు ఇప్పుడు ఉద్యోగుల పాలిట శాపంగా మారుతున్నాయి.

లీవ్​ పాలసీపై హైకోర్టులో పిల్

ఐటీ కంపెనీల్లో కష్టాలు, వేధింపులు, పని ఒత్తిళ్లను భరించలేక ఈమధ్యనే కొందరు హైర్టు కెళ్లారు. వీరిలో ప్రముఖ ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగులే ఎక్కువ ఉన్నారు. ఎక్కువ పని గంటలు చేయించినా ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడం, లీవ్ పాలసీ విధానంలో మార్పులు చేస్తున్నారని పిల్ దాఖలు చేశారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి

కంపెనీల ఆగడాలను నియంత్రించడానికి సరైన యంత్రాంగం లేదు. ఈ కారణంగానే చాలా కంపెనీలు బలవంతంగా తొలగిస్తున్నాయి. ఒకవేళ రిజైన్ చేయకుండా ఉద్యోగి ఉండిపోయినా వస్తువులు ఎత్తుకెళ్లారని కేసు నమోదు చేయించి వేధిస్తున్నారు. కంపెనీలను ప్రోత్సహించినట్టుగానే ఉద్యోగ భద్రత, పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించాలి.

– వినోద్ కుమార్, ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్