ఢిల్లీ నుంచి వచ్చి చైన్ స్నాచింగ్ లు..గంట వ్యవధిలో హైదరాబాద్ సిటీలో 3 దోపిడీలు

ఢిల్లీ నుంచి వచ్చి చైన్ స్నాచింగ్ లు..గంట వ్యవధిలో హైదరాబాద్ సిటీలో 3 దోపిడీలు
  • ఇద్దరు అంతర్రాష్ట్ర పాత నేరస్తుల అరెస్ట్
  • ఢిల్లీకి వెళ్లి అదుపులోకి తీసుకున్న చైతన్యపురి పోలీసులు

ఎల్బీనగర్, వెలుగు: సిటీ శివారులో వరుస చైన్ స్నాచింగ్​లకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర పాత నేరస్తులను ఢిల్లీలో చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఎల్బీనగర్​ డీసీపీ అనురాధ మంగళవారం తెలిపారు. ఢిల్లీకి చెందిన అక్షయ్ కుమార్ శర్మ, రోహిత్ అదే ప్రాంతంలో గతంలో ఫుడ్ డెలివరీ బాయ్స్​గా పనిచేశారు.

 ఇటీవల హైదరాబాద్​కు వచ్చిన వీరిద్దరూ ఈ నెల 17న హయత్ నగర్, నాగోల్, చైతన్యపురి పరిధిలో పల్సర్​ బైక్​పై తిరుగుతూ కేవలం గంట వ్యవధిలో మూడు స్నాచింగ్​లకు​పాల్పడ్డారు. పల్సర్​బైక్​ను కూడా అదే రోజు తెల్లవారుజామున గోపాలాపురం పీఎస్​పరిధిలో దొంగతనం చేశారు. చైన్ స్నాచింగ్​ల తర్వాత  బైక్​ను సికింద్రాబాద్​లోని సంగీత థియేటర్ క్రాస్ రోడ్స్ సమీపంలో వదిలేసి ఢిల్లీకి పారిపోయారు. 

ఈ ఘటనపై చైతన్యపురి ఇన్​స్పెక్టర్ సైదులు నేతృత్వంలో పోలీసులు 3 స్పెషల్​టీమ్​లుగా ఏర్పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు, టవర్ డంప్ అనాలిసిస్ ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించారు. ఒక టీమ్​ఢిల్లీకి వెళ్లి నిందితులను అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి మొత్తం 11తులాల 3 బంగారు ఆభరణాలతో పాటు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.

దర్యాప్తులో కీలక విషయాలు

ప్రధాన నిందితుడు అక్షయ్​ కుమార్ శర్మ పై దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో మొత్తం 21 కేసులు ఉండగా.. రోహిత్ పై 13 కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, నాగపూర్​లలో నమోదయ్యాయని డీసీపీ తెలిపారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 9  కేసులు ఉన్నట్లు చెప్పారు. 2025 జూలైలో నాగ్‌‌పూర్ పోలీసులు వీరిని అరెస్ట్ చేయగా, జైలు నుంచి విడుదలైన  వెంటనే హైదరాబాద్‌‌కు వచ్చి పలు పోలీస్ స్టేషన్ పరిధిలో 7 చైన్​స్నాచింగ్​లకు పాల్పడినట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు.

నగల కోసమే అడ్డా కూలీ హత్య.. ఇద్దరు అరెస్ట్

వికారాబాద్, వెలుగు : బంగారం కోసం అడ్డా కూలీని దారుణంగా హత్య చేసిన ఇద్దరిని తాండూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య వివరాల ప్రకారం.. యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన లొంకల బందెమ్మ (54) బంగారంపై తోటి కూలీలైన మాల నర్సింహులు, కిశోర్ షిండే కన్నేశారు. ఈ నెల 21న ఓ ఫామ్​హౌస్‌‌లో పని ఉందని నమ్మించి ఆమెను రేగొండి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి చంపేశారు. 

అనంతరం ఆమె వద్ద ఉన్న 30 తులాల వెండి కడియాలు, బంగారు గొలుసును దొంగిలించి శంకర్​పల్లిలోని ఓ షాపులో రూ. 49 వేలకు అమ్మేశారు. లేబర్ అడ్డా వద్ద సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను మంగళవారం పట్టుకొని విచారించగా నేరం అంగీకరించారు. మాల నర్సింహులు 2021లో యాలాల మండలంలోని రాస్నం గ్రామంలో లక్ష్మి అనే మహిళను ఇదే తరహా హత్య చేశాడని డీఎస్పీ తెలిపారు.