
- నాగార్జునసాగర్కు పెరిగిన వరద తాకిడి.. 512 అడుగులకు చేరిన నీటిమట్టం
శ్రీశైలం, హాలియా, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. మూడు గేట్లను ఓపెన్ చేసి దిగువకు 80 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జూరాల నుంచి 3,03,984 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,48,599 క్యూసెక్కులు కలుపుకొని మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకు 4,52,583 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది. అవుట్ ఫ్లో 80 వేల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 879.20 అడుగులకు నీరు చేరింది. ఫుల్ కెపాసిటీ 215.80 టీఎంసీలు. ప్రస్తుతం 184.27 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.
వరద తాకిడీ పెరగడంతో నాగార్జున సాగర్కూడా కళకళలాడుతోంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.50 టీఎంసీలు) కాగా సోమవారం రాత్రి వరకు 512.80 అడుగులకు (136.47 టీఎంసీలు) చేరింది. కుడికాలువకు 5,882 క్యూసెక్కులు, ఎస్ ఎల్ బీసీకి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్కు ఇన్ఫ్లో 76,985 క్యూసెక్కులు వస్తుండగా, ప్రాజెక్టు నుంచి 28,959 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్కు వరద నీటిని విడుదల చేస్తుండడంతో నల్గొండ జిల్లాలోని కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు. మత్స్యకారులు చేపలు పట్టేందుకు నదిలోకి వెళ్లొద్దని సూచించారు.