భద్రాచలం, వెలుగు : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోని రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ (ఆర్పీసీ) కి చెందిన ముగ్గురు సభ్యులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. భద్రాచలం కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వెంకటచెరువు గ్రామ అటవీ ప్రాంతంలో పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఆర్పీసీ సభ్యులను శనివారం అరెస్ట్ చేశామని భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ ప్రకటించారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఊసూర్ ఠాణా పరిధిలోని చిన్న ఊట్లపల్లికి చెందిన మడివి గంగ, రాంపూర్ గ్రామానికి చెందిన మడివి అంద, బీమారం గ్రామానికి చెందిన కొవ్వాసి మంగులు.. మావోయిస్టు పార్టీ నిర్వహించే సమావేశాలకు ఆదివాసీలను తరలించడంతో పాటు, వారిని బెదిరించి మావోయిస్టులకు నిత్యావసర సరుకులను తీసుకెళ్తున్నారని ఏఎస్పీ తెలిపారు. దండకారణ్యం బెటాలియన్ కమాండర్ హిడ్మా, తెలంగాణ రాష్ట్ర అగ్ర నాయకులు దామోదర్, ఆజాద్, మధు, అరుణ, లచ్చన్న, మంగు, అర్జున్ తదితరుల కోసం ఆ ముగ్గురు పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలను బహిష్కరించాలని గ్రామాల్లో కరపత్రాలు పంచేందుకు వెళుతుండగా అదుపులోకి తీసుకున్నామని ఏఎస్పీ వెల్లడించారు.

