
- 5.75 లక్షల టన్నుల కోటాలో 4.73 లక్షల టన్నుల రేషన్ పంపిణీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సన్న బియ్యం పంపిణీలో ఇప్పటికే 85 శాతం పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు జూన్, జులై, ఆగస్టు నెలల కోటా కింద రేషన్ను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున రాష్ట్రంలోని 91.83 లక్షల రేషన్ కార్డులున్న కుటుంబాలకు సివిల్ సప్లైస్ శాఖ రేషన్ పంపిణీ చేస్తోంది. ఈనెల మొదటి వారంలో 3 నెలల రేషన్ను ఒకేసారి ఇవ్వడం ప్రారంభించగా.. ఈ–పాస్ మెషీన్లో సాఫ్ట్వేర్ సమస్య తలెత్తింది. దీనికితోడు బయోమెట్రిక్ తీసుకునే సందర్భంలో ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో పంపిణీలో జాప్యం జరిగింది. దీంతో వేలిముద్రలు తీసుకునే విధానాన్ని అధికారులు సింప్లిఫై చేసి మూడింటికే పరిమితం చేయడంతో సమస్యను అధిగమించారు. ఫలితంగా రేషన్ పంపిణీ మరింత స్పీడప్ అయింది.
రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా ఈనెల ప్రారంభం నుంచి రేషన్ పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలోని 91.83 లక్షల రేషన్ కార్డుల్లో ఇప్పటి వరకు 76 లక్షల కార్డుహోల్డర్లకు రేషన్ అందించారు. గత 23 రోజుల్లోనే 85 శాతం మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17, 349 రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డులున్న కుటుంబాల్లోని 2.60 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేశామని సివిల్ సప్లైస్ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు నెలకు 1.91లక్షల టన్నుల చొప్పున 3 నెలల కోసం దాదాపు 5.75 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరం అవుతాయని అధికారులు అంచనా చేశారు. అయితే, ఇందులో ఇప్పటి వరకు 4.73 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ పూర్తి చేశారు.
ఈ నెలాఖరు వరకు పంపిణీ
రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ఈ నెలాఖరు వరకు కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతినెలా రేషన్ కోటాలో 90 శాతం వరకు రేషన్ పంపిణీ జరుగుతుంది. మిగతా 10 శాతం వివిధ కారణాలతో రేషన్ తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ, ఈసారి ఒకేసారి 3 నెలల కోటా ఇస్తున్నప్పటికీ ఎక్కువ మంది లబ్ధిదారులకు సన్న బియ్యం అందించగలిగామని ఆఫీసర్లు తెలిపారు.