85 శాతం మందికి మూడు నెలల రేషన్.. 76 లక్షల కార్డు హోల్డర్లకు సన్న బియ్యం

85 శాతం మందికి మూడు నెలల రేషన్.. 76 లక్షల కార్డు హోల్డర్లకు సన్న బియ్యం
  • 5.75 లక్షల టన్నుల కోటాలో 4.73 లక్షల టన్నుల రేషన్ పంపిణీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సన్న బియ్యం పంపిణీలో ఇప్పటికే 85 శాతం పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు జూన్, జులై, ఆగస్టు నెలల కోటా కింద రేషన్​ను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున రాష్ట్రంలోని 91.83 లక్షల రేషన్​ కార్డులున్న కుటుంబాలకు సివిల్​ సప్లైస్​ శాఖ రేషన్​ పంపిణీ చేస్తోంది.  ఈనెల మొదటి వారంలో 3 నెలల రేషన్​ను ఒకేసారి ఇవ్వడం ప్రారంభించగా.. ఈ–పాస్​ మెషీన్​లో సాఫ్ట్​వేర్​ సమస్య తలెత్తింది. దీనికితోడు బయోమెట్రిక్  తీసుకునే సందర్భంలో ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో పంపిణీలో జాప్యం జరిగింది. దీంతో వేలిముద్రలు తీసుకునే విధానాన్ని అధికారులు సింప్లిఫై చేసి మూడింటికే పరిమితం చేయడంతో సమస్యను అధిగమించారు. ఫలితంగా రేషన్​ పంపిణీ మరింత స్పీడప్  అయింది.

రాష్ట్రంలోని రేషన్​ షాపుల ద్వారా ఈనెల ప్రారంభం నుంచి రేషన్​ పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలోని 91.83 లక్షల రేషన్  కార్డుల్లో ఇప్పటి వరకు 76 లక్షల కార్డుహోల్డర్లకు రేషన్  అందించారు. గత 23 రోజుల్లోనే 85 శాతం మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17, 349 రేషన్​ షాపుల ద్వారా రేషన్​ కార్డులున్న కుటుంబాల్లోని 2.60 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్​ పంపిణీ చేశామని సివిల్ ​ సప్లైస్ ​ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు నెలకు 1.91లక్షల టన్నుల చొప్పున 3 నెలల కోసం దాదాపు 5.75 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరం అవుతాయని అధికారులు అంచనా చేశారు. అయితే, ఇందులో ఇప్పటి వరకు 4.73 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ పూర్తి చేశారు.

ఈ నెలాఖరు వరకు పంపిణీ
రేషన్​ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ఈ నెలాఖరు వరకు కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతినెలా రేషన్ ​ కోటాలో 90 శాతం వరకు రేషన్​ పంపిణీ జరుగుతుంది. మిగతా 10 శాతం వివిధ కారణాలతో రేషన్​ తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ, ఈసారి ఒకేసారి 3 నెలల కోటా ఇస్తున్నప్పటికీ ఎక్కువ మంది లబ్ధిదారులకు సన్న బియ్యం అందించగలిగామని ఆఫీసర్లు తెలిపారు.