పాన్ కార్డులు సేకరించి సైబర్ నేరాలు

పాన్ కార్డులు సేకరించి సైబర్ నేరాలు
  • ఫేక్​ డాక్యుమెంట్స్​తో మోసాలు
  • ముగ్గురు సైబర్​ నేరగాళ్లు  అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు : ఫేక్​ డాక్యుమెంట్స్ తో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని సైబరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​ నగరానికి చెందిన  విశాల్​ మోహన్​ కాప్సేకు ఆగస్టు 9న ఢిల్లీకి చెందిన  ఇండియా బుల్స్​ కంపెనీ నుండి ఫోన్​ కాల్​ వచ్చింది.  మీరు కంపెనీ నుండి  తీసుకున్న పర్సనల్​లోన్​కు సంబంధించిన  ఇన్​స్టాల్​మెంట్  కట్టాలని తెలిపారు. దీంతో అవాక్కైన విశాల్​ మోహన్​ తనది ఢిల్లీ కాదని తాను హైదరాబాద్​లో నివాసం ఉంటున్నానని, అసలు తాను  ఇండియా​ బుల్స్​ కంపెనీలో పర్సనల్​లోన్​ కోసం  అప్లై చేయలేదని కంపెనీ ప్రతినిధులకు తెలిపాడు.  అనంతరం తన సిబిల్​ చెక్​ చేసుకోగా తన పేరు మీద ఆగస్టు 9న ఇండియా బుల్స్​ కంపెనీలో రూ. 13,55,500  పర్సనల్ లోన్​ను  తీసుకున్నట్లు ఉంది. ఢిల్లీలోని  మునిర్కా సీ 14 అడ్రస్​  పేరిట  జూన్​ 25వ తేదిన లోన్​కు అప్లై చేసినట్లు విశాల్​ మోహన్​ గుర్తించాడు. తన పేరుపై తప్పుడు అడ్రస్​ క్రియేట్​ చేసి పర్సనల్​ లోన్​ తీసుకున్నట్లు విశాల్​ మోహన్​  గుర్తించి   సెప్టెంబర్​ 3న సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులను అశ్రయించాడు. ఈ మేరకు సైబర్​ క్రైమ్​ ఇన్​స్పెక్టర్​ మధు మోహన్​ కేసు దర్యాప్తు చేపట్టారు.

ఫేక్​ పాన్​కార్డులు

ఢిల్లీకి చెందిన హిమాన్షు ఖన్నా డాటా ప్రొవైడర్ల నుంచి ప్రజలకు సంబంధించిన పాన్ కార్డులను సేకరిస్తాడు. అనంతరం పాన్​ కార్డులో ఫొటో, అడ్రస్​లు మార్చి వాటి సహాయంతో యాక్సిస్​, ఐసీఐసీఐ, ఫెడరల్​ బ్యాంకు,  బ్యాంక్​ ఆఫ్​ బరోడాలలో అక్కడి బ్యాంకు అధికారుల సహాయంతో  బ్యాంక్​ అకౌంట్స్​ ఓపెన్​ చేస్తాడు. అనంతరం ధని యాప్​ ద్వారా పర్సనల్ లోన్​ కోసం ఇండియా బుల్స్​ కంపెనీలో వివిధ పేర్లతో అప్లై చేస్తాడు. ఇలా 2018 నవంబర్​ నుండి  ఇప్పటి వరకు హిమాన్షు ఖన్నా 22 పాన్​ కార్డులు ఉపయోగించి ధని యాప్​ ద్వారా ఇండియా బుల్స్​ కంపెనీలో పర్సనల్​ లోన్స్​కు అప్లై చేశాడు.  పోలీసుల దర్యాప్తులో హిమాన్షు  బ్యాంకుల్లో పనిచేసే గౌరవ్​కుమార్, దీపక్​కుమార్​ల సహాయంతో   దాదాపు రూ. 73,50,000 వరకు ఫేక్​ డాక్యుమెంట్స్​ పెట్టి పర్సనల్​ లోన్​ తీసుకొని సైబర్​ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.  నవంబర్ 29వ తేదీన నిందితుడు హిమాన్షుతో పాటు అతనికి సహకరించిన  బ్యాంకర్లు గౌరవ్​కుమార్​, దీపక్​కుమార్​లను సైబర్​ క్రైమ్​ పోలీసులు అరెస్ట్​ చేసి కోర్టులో హాజరుపర్చారు. నిందితుడి వద్ద నుండి మూడు సెల్​ఫోన్స్​, పాన్​కార్డులు, ఓటర్​ ఐటీ కార్డులు, చెక్​బుక్స్​ను స్వాధీనం చేసుకున్నారు.

three people arrested for cheating with fake documents in Hyderabad