ప్లీజ్ కాపాడండి.. మా వాళ్లకు ఫోన్ చేయండి... : లారీ టైర్ల కింద ఇరుక్కుని బీటెక్ విద్యార్థిని ఆర్తనాదాలు

ప్లీజ్ కాపాడండి.. మా వాళ్లకు ఫోన్ చేయండి... : లారీ టైర్ల కింద ఇరుక్కుని బీటెక్ విద్యార్థిని ఆర్తనాదాలు
  • ట్యాంకర్ ఢీకొనడంతో తండ్రీకూతుళ్ల మృతి
  • రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో ఘటన

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్​ నగర్​చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బైక్​ను ట్యాంకర్ ఢీకొనడంతో తండ్రీకూతుళ్లు మృతి చెందారు. ఈ ప్రమాదంలో లారీ టైర్ల కింద ఇరుక్కుని యువతి ఆర్తనాదాలు చేయడం స్థానికులను కలచివేసింది. షాద్​నగర్​లోని శ్రీనివాస కాలనీకి చెందిన మచ్చేందర్‌‌ (48) కుమార్తె మైత్రి (20) శంషాబాద్‌‌ వర్ధమాన్‌‌ కాలేజీలో బీటెక్‌‌ చదువుతోంది. 

తన కుమార్తెను కాలేజీకి పంపించేందుకు మచ్చేందర్ బైక్​పై శనివారం ఉదయం బస్టాప్‌‌కు బయలుదేరారు. షాద్‌‌నగర్‌‌ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా, ట్యాంకర్​నిర్లక్ష్యంగా వస్తూ వీరిని ముందు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మచ్చేందర్‌‌ స్పాట్​లోనే మృతి చెందగా, మైత్రికి తీవ్రగాయాలై లారీ టైర్ల మధ్యలో ఇరుక్కు పోయింది. 

ఈ క్రమంలో అతికష్టం మీద అక్కడున్న ఒక వ్యక్తికి ఫోన్​ఇచ్చి తన వాళ్లకు ఫోన్​చేయాలని, కాపాడండి అంటూ ప్రాధేయపడింది. అదే సమయంలో తన ఫ్రెండ్స్​​నుంచి మైత్రికి ఫోన్లు రావడంతో.. స్థానికులు ప్రమాదం విషయం చెప్పారు. కాసేపటికి మైత్రి కూడా కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌‌నగర్‌‌ ఏరియా హాస్పిటల్​కు తరలించారు.