పాలమూరులో ఆ ముగ్గురిని పట్టుకెళ్లింది పోలీసులే

పాలమూరులో ఆ ముగ్గురిని పట్టుకెళ్లింది పోలీసులే
  • ఇందులో ఇద్దరు మంత్రి శ్రీనివాస్​గౌడ్​పై ఈసీకి ఫిర్యాదు చేసిన వాళ్లే
  • అరెస్ట్​ చేసిన పేట్​ బషీరాబాద్​ పోలీసులు
  • వెపన్స్​ కోసం ఓ వ్యక్తిని ఆశ్రయించారని అభియోగం
  • మేడ్చల్​     కోర్టులో హాజరు
  • 30 రోజుల జ్యుడీషియల్​ రిమాండ్​  
  • రాజకీయ కారణాలు ఉండవచ్చనే కోణంలో చర్చ 

హైదరాబాద్​, వెలుగు : మహబూబ్​నగర్​లో ఈ నెల 23, 24 తేదీల్లో కిడ్నాప్​కు గురయ్యారనే ప్రచారం జరిగిన ముగ్గురిని మేడ్చల్​ జిల్లా పేట్​బషీరాబాద్​ పోలీసులు అరెస్ట్​ చూపారు.  మహబూబ్​నగర్​కే చెందిన గులాం హైదర్​ అనే వ్యక్తిని  చంపేందుకు ప్రయత్నించారని చలువగాలి నాగరాజు, బండేకర్​ విశ్వనాథ్​రావు, వర్ధ యాదయ్యల పై ఐపీసీ ​120బి, 307, 115, ఆర్మ్స్​ యాక్ట్​ 25 కింద కేసులు నమోదు చేశారు.  ఈ ముగ్గురినీ ఆదివారం మేడ్చల్​ మెట్రోపాలిటన్​ కోర్టులో హాజరుపరచగా 30 రోజుల జ్యుడీషియల్​ రిమాండ్​ విధించడంతో చంచల్​ గూడ జైలుకు తరలించారు. మరో నిందితుడు చలువగాలి రాఘవేంద్ర రాజు అలియాస్​ రఘు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. పేట్​బషీరాబాద్​ పోలీసులు ఎఫ్​ఐఆర్​లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. మహబూబ్​నగర్​ పట్టణానికి చెందిన చలువగాలి రాఘవేంద్ర రాజు అలియాస్​ రఘు, నాగరాజు అన్నదమ్ములు. అక్కడే టీచర్స్​ కాలనీకి చెందిన గులాం హైదర్​ అలీకి వీరి కుటుంబంతో గొడవలున్నాయి. ఈ క్రమంలో హైదర్​ అలీని మర్డర్​ చేయాలని నిర్ణయించుకున్నారు.

డిసెంబరు 18న పాలమూరులోని ఎక్సైజ్​ కోర్టుకు వచ్చిన శంషాబాద్​కు చెందిన ఫారూఖ్​ అహ్మద్​ను కలిసి హైదర్​ అలీని చంపేందుకు వెపన్స్ కావాలని అడిగారు. ​ దీనికి ఫారూఖ్​ నిరాకరించి వెళ్లిపోయాడు. తర్వాత విషయాన్ని హైదర్​ అలీకి చెప్పాడు. భయపడిన హైదర్​ అలీ తాను ఇక్కడే ఉంటే చంపేస్తారని, ఎక్కడైనా సేఫ్​ ప్లేస్​లో ఉంచాలని కోరాడు. దీంతో మేడ్చల్​ పరిధిలోని సుచిత్ర దగ్గర ఉన్న ఒక లాడ్జీలో ఉంచాడు. 25వ తేదీన హైదర్​ అలీ, ఫారుఖ్​ అహ్మద్​ టీ తాగడానికి లాడ్జీ నుంచి బయటకు రాగా నాగరాజుతో పాటు మరికొందరు చూశారు. కత్తులతో వెంటపడి చంపాలని చూశారు. తప్పించుకున్న  ఇద్దరు పేట్​ బషీరాబాద్​ పోలీస్​ స్టేషన్​లో కంప్లయింట్​ ఇచ్చారు. దీంతో  పోలీసులు ఏ1గా రఘును, ఏ2గా చలువగాలి నాగరాజు, ఏ3గా బండేకర్​ విశ్వనాథ్​రావు, ఎ4గా వర్ధ యాదయ్య పేర్లను చేర్చారు. వీరిలో 26వ తేదీన నాగరాజు, విశ్వనాథ్, యాదయ్యను  మహబూబ్​నగర్​లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన అనంతరం హైదరాబాద్​లోని మేడ్చల్​ మెట్రో పాలిటన్​ కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలించారు. ఏ1గా ఉన్న రఘు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 
అరెస్టులపై అనుమానాలు
ఈ అరెస్టులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 24న విశ్వనాథ్​, యాదయ్యలను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్​ చేసినట్లు వారి కుటుంబ సభ్యులు మహబూబ్​నగర్ ​టూటౌన్​లో 25న కంప్లయింట్​ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్​ చేస్తున్నామని, త్వరలోనే కనుక్కుంటామని టూ టౌన్​ సీఐ సోమ్​ నారాయణసింగ్ అదే రోజు చెప్పారు. ఇప్పటికీ రఘు ఆచూకీ దొరకడం లేదు.

ఇలాంటి టైంలో ముగ్గురిని అరెస్ట్​ చేసినప్పుడు కుటుంబ సభ్యులకు గానీ,  లోకల్​ పోలీసులకుగానీ సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక ఏ1గా ఉన్న రఘు..  మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఎన్నికల అఫిడవిట్​ టాంపరింగ్​ వ్యవహారంపై కొద్దిరోజుల క్రితం ఈసీకి కంప్లయింట్​ చేశాడు. దీనికి ఏ2 నాగరాజు సపోర్ట్​ చేయగా, ఏ3 విశ్వనాథ్ ఫస్ట్​ విట్​నెస్​గా ఉన్నాడు. ఏ4 యాదయ్య సోషల్​మీడియాలో మంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంటాడు. ఈ క్రమంలో అరెస్టు చేయడంతో రాజకీయ కారణాలు ఉన్నాయా అనే కోణంలో చర్చ జరుగుతోంది.