
- ఇందులో ఇద్దరు మంత్రి శ్రీనివాస్గౌడ్పై ఈసీకి ఫిర్యాదు చేసిన వాళ్లే
- అరెస్ట్ చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు
- వెపన్స్ కోసం ఓ వ్యక్తిని ఆశ్రయించారని అభియోగం
- మేడ్చల్ కోర్టులో హాజరు
- 30 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
- రాజకీయ కారణాలు ఉండవచ్చనే కోణంలో చర్చ
హైదరాబాద్, వెలుగు : మహబూబ్నగర్లో ఈ నెల 23, 24 తేదీల్లో కిడ్నాప్కు గురయ్యారనే ప్రచారం జరిగిన ముగ్గురిని మేడ్చల్ జిల్లా పేట్బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చూపారు. మహబూబ్నగర్కే చెందిన గులాం హైదర్ అనే వ్యక్తిని చంపేందుకు ప్రయత్నించారని చలువగాలి నాగరాజు, బండేకర్ విశ్వనాథ్రావు, వర్ధ యాదయ్యల పై ఐపీసీ 120బి, 307, 115, ఆర్మ్స్ యాక్ట్ 25 కింద కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురినీ ఆదివారం మేడ్చల్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరచగా 30 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో నిందితుడు చలువగాలి రాఘవేంద్ర రాజు అలియాస్ రఘు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. పేట్బషీరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణానికి చెందిన చలువగాలి రాఘవేంద్ర రాజు అలియాస్ రఘు, నాగరాజు అన్నదమ్ములు. అక్కడే టీచర్స్ కాలనీకి చెందిన గులాం హైదర్ అలీకి వీరి కుటుంబంతో గొడవలున్నాయి. ఈ క్రమంలో హైదర్ అలీని మర్డర్ చేయాలని నిర్ణయించుకున్నారు.
డిసెంబరు 18న పాలమూరులోని ఎక్సైజ్ కోర్టుకు వచ్చిన శంషాబాద్కు చెందిన ఫారూఖ్ అహ్మద్ను కలిసి హైదర్ అలీని చంపేందుకు వెపన్స్ కావాలని అడిగారు. దీనికి ఫారూఖ్ నిరాకరించి వెళ్లిపోయాడు. తర్వాత విషయాన్ని హైదర్ అలీకి చెప్పాడు. భయపడిన హైదర్ అలీ తాను ఇక్కడే ఉంటే చంపేస్తారని, ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో ఉంచాలని కోరాడు. దీంతో మేడ్చల్ పరిధిలోని సుచిత్ర దగ్గర ఉన్న ఒక లాడ్జీలో ఉంచాడు. 25వ తేదీన హైదర్ అలీ, ఫారుఖ్ అహ్మద్ టీ తాగడానికి లాడ్జీ నుంచి బయటకు రాగా నాగరాజుతో పాటు మరికొందరు చూశారు. కత్తులతో వెంటపడి చంపాలని చూశారు. తప్పించుకున్న ఇద్దరు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఏ1గా రఘును, ఏ2గా చలువగాలి నాగరాజు, ఏ3గా బండేకర్ విశ్వనాథ్రావు, ఎ4గా వర్ధ యాదయ్య పేర్లను చేర్చారు. వీరిలో 26వ తేదీన నాగరాజు, విశ్వనాథ్, యాదయ్యను మహబూబ్నగర్లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన అనంతరం హైదరాబాద్లోని మేడ్చల్ మెట్రో పాలిటన్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఏ1గా ఉన్న రఘు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అరెస్టులపై అనుమానాలు
ఈ అరెస్టులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 24న విశ్వనాథ్, యాదయ్యలను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు వారి కుటుంబ సభ్యులు మహబూబ్నగర్ టూటౌన్లో 25న కంప్లయింట్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని, త్వరలోనే కనుక్కుంటామని టూ టౌన్ సీఐ సోమ్ నారాయణసింగ్ అదే రోజు చెప్పారు. ఇప్పటికీ రఘు ఆచూకీ దొరకడం లేదు.
ఇలాంటి టైంలో ముగ్గురిని అరెస్ట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులకు గానీ, లోకల్ పోలీసులకుగానీ సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక ఏ1గా ఉన్న రఘు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ వ్యవహారంపై కొద్దిరోజుల క్రితం ఈసీకి కంప్లయింట్ చేశాడు. దీనికి ఏ2 నాగరాజు సపోర్ట్ చేయగా, ఏ3 విశ్వనాథ్ ఫస్ట్ విట్నెస్గా ఉన్నాడు. ఏ4 యాదయ్య సోషల్మీడియాలో మంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంటాడు. ఈ క్రమంలో అరెస్టు చేయడంతో రాజకీయ కారణాలు ఉన్నాయా అనే కోణంలో చర్చ జరుగుతోంది.