
విద్యుత్ షాక్ తగిలి వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోసి గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి తండ్రీకొడుకులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అడవి పందుల కోసం వేసిన విద్యుత్ తీగలు తగిలి తండ్రి రాములు(50), కొడుకు మురళి(25) మృతి చెందారు.
మరో ఘటనలో మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలం కంసానపల్లి గ్రామానికి చెందిన తిరుపతి (35) అనే వ్యక్తి మరణించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఎయిర్ టెల్ టవర్లో పని చేసే తిరుపతి.. బుధవారం కురిసిన వర్షానికి పనుల నిమిత్తం వెళ్లగా.. తిరుపతి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.