ప్రతి మనిషి ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోతాడు. కానీ.. మనిషి వాడే వస్తువులు మాత్రం వందల ఏండ్ల పాటు మట్టిని కలుషితం చేస్తుంటాయి. అందుకే.. ఆర్కిటెక్ట్లు భక్తి లూనావత్, సుయాష్ సావంత్లు మట్టిలో కలిసిపోయే ఫర్నిచర్ని తయారుచేశారు. అందుకోసం ప్రత్యేకంగా మష్రూమ్స్ని పెంచుతున్నారు. ఆ మష్రూమ్స్నే కన్సోల్స్, బ్లాక్స్, క్లాత్గా మార్చి వాళ్ల స్టార్టప్ ‘అనోమాలియా’ ద్వారా అమ్ముతున్నారు.
ముంబైలోని ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఎంట్రెన్స్ దగ్గర అందమైన కన్సోల్ టేబుల్ ఉంది. దాన్ని చూడగానే కాస్త వింతగా అనిపిస్తుంది. దగ్గరకు వెళ్లే చూస్తే.. దాని బేస్ చెక్క, రాయి, లోహంతో తయారుచేయలేదని స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని ఒక రకమైన మష్రూమ్తో తయారుచేశారు. అందుకోసం మష్రూమ్ ధాతువైన మైసిలియంని కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో డెవలప్ చేస్తారు. అది 70–80 కిలోల బరువును తట్టుకోగలదు. పైగా చాలా తేలికగా ఉంటుంది.
ఈ మష్రూమ్ ఫర్నిచర్ని డిజైన్ చేసింది ముంబైకి చెందిన భక్తి లూనావత్, సుయాష్ సావంత్. వాళ్లు మొదటిసారి 2010లో ముంబైలోని ఒక ఆర్కిటెక్చర్ స్కూల్లో కలిశారు. 2015లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఇద్దరూ బార్సిలోనాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కాటలోనియా (ఐఏఏసీ)కి పై చదువుల కోసం వెళ్లారు. చదువు పూర్తయ్యాక ఇద్దరి మార్గాలు వేరయ్యాయి. భక్తి స్పానిష్ ఆర్కిటెక్ట్ రికార్డో బోఫిల్తో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. సుయాష్ లిస్బన్లో ప్రాక్టీస్ చేశాడు. కానీ.. ఇద్దరూ 2022లో తిరిగొచ్చి ముంబైలో కలుసుకున్నారు. అదే సంవత్సరం వాళ్లు ‘అనోమాలియా’ పేరుతో స్టార్టప్ పెట్టారు.
వ్యర్థాలను తగ్గించేందుకు..
సాధారణంగా కన్స్ట్రక్షన్, డిజైన్ ఇండస్ట్రీల నుంచి చాలా వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. భక్తి, సుయాష్లు వాటిని తగ్గించేందుకు ఎప్పుడూ కొత్త మార్గాలను వెతికేవాళ్లు. వాస్తవానికి ఇద్దరిని కలిపింది కూడా ఆ ఆలోచనే. అప్పుడే వాళ్లు మైసిలియం రీ జెనరేటివ్, సర్క్యులర్ నేచర్ గురించి తెలుసుకున్నారు. దాంతో ఫర్నిచర్ తయారుచేస్తే లైఫ్ స్పాన్ పూర్తి కాగానే బయోడీగ్రేడ్ అవుతుంది. అంటే నేచర్లో కలిసిపోతుంది. ఇతర ఫర్నిచర్ మెటీరియల్స్లా భూమిపై పేరుకుపోదు.
దీనిపై ప్రయోగాలు చేసేందుకు కరోనా టైంలో వాళ్లకు కావాల్సినంత సమయం దొరికింది. కరోనా వల్ల ఇద్దరూ ఇంటికే పరిమితమయ్యారు. అప్పుడే వాళ్లు దీనిపై రీసెర్చ్, ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ముందుగా వాళ్లు కప్ కేక్ ట్రేల్లో మష్రూమ్స్ని పెంచారు. అవి తేలికగా ఉన్నప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అప్పటినుంచి వాటితో ఇటుకలు, పార్టిషన్స్, క్లాత్ తయారుచేశారు. చివరికి ఫర్నిచర్తో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు.
పెంచుతున్నారు..
ఇప్పుడు వాళ్లు అనోమాలియాలో ఫర్నిచర్ తయారుచేయడం లేదు. పెంచుతున్నారు. అందుకే ‘గ్రోన్ నాట్ బిల్ట్’ అనే ట్యాగ్లైన్తో ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నారు. మైసిలియంని అగ్రికల్చర్ వేస్ట్తో కలిపి మాడ్యులర్ “మైక్రోబ్లాక్లను” తయారుచేస్తారు. ప్రతి బ్లాక్ 1.5 కిలోల బరువు ఉంటుంది. కానీ, 1.5 టన్నుల కంప్రెసివ్ లోడ్ను తట్టుకోగలదు. ఈ బ్లాక్లను స్టూల్స్, టేబుళ్లు, అల్మారాలు.. ఇలా ఏ ఫర్నిచర్ తయారీలో అయినా వాడుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏంటంటే.. దీంతో ‘మైకోలైవింగ్’ అనే మైసిలియం క్లాత్ని కూడా తయారుచేస్తున్నారు.
మైసిలియం ఓవర్ గ్రోత్ దశలో ఉన్నప్పుడు దాని పొరని ఒలిచి, ప్రాసెస్ చేసి సీటింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. పెరిగిన మైసిలియం బ్లాక్స్ను కాల్చడం, ఎండలో ఆరబెట్టడం వల్ల అది చాలా స్ట్రాంగ్గా మారుతుంది. దానికి తేనె తెట్టె మైనం, లైమ్ ప్లాస్టర్ లాంటి న్యాచురల్ కోటింగ్స్ వేస్తారు. వీళ్లు తయారుచేసిన ప్రొడక్ట్స్ 10 నుంచి 12 సంవత్సరాల వరకు మన్నికగా ఉంటాయి. ఆ తర్వాత చెత్తలో వేస్తే 180 రోజుల్లో మట్టిలో కలిసిపోతాయి.
ఎన్నో సవాళ్లు..
పుట్టగొడుగులను పెంచడం మామూలు విషయం కాదు. ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. వాటన్నింటినీ అధిగమిస్తేనే క్వాలిటీ ప్రొడక్ట్ తయారవుతుంది. కొన్నిసార్లు కంటామినేషన్ వల్ల గ్రో అయిన బ్లాక్స్ని కూడా పక్కనపెట్టాల్సి వస్తుంది. తేమ స్థాయిల్లో మార్పులు వచ్చినా మైసిలియం పూర్తిగా పాడైపోతుంది. మైసిలియం బంకమట్టి లేదా సిమెంట్ లాంటిది కాదు. దీంతో డిజైన్ చేయడం చాలా కష్టం. అందుకు ఎంతో ఓపిక కావాలి. ఆర్థికంగా కూడా ఈ ప్రయాణం కష్టమైనది. భక్తి, సుయాష్లు ఉద్యోగాలు చేసి సంపాదించుకున్నది మొత్తం ఇందులోనే ఇన్వెస్ట్ చేశారు. గోద్రేజ్ లాంటి ఫెలోషిప్స్, గ్రాంట్ల వల్ల కొంత ఆర్థికసాయం అందింది.
ముంబై నుంచి..
భక్తి, సుయాష్ 2022లో అనోమాలియాను ప్రారంభించినప్పుడు వాళ్లలో తమ ప్రొడక్ట్స్ని ప్రజలు కొంటారో లేదో అనే అనుమానం ఉండేది. కానీ.. కేవలం మూడు సంవత్సరాల్లోనే వాళ్ల ప్రొడక్ట్స్కి ఎంతో గుర్తింపు దక్కింది. 2025లో అత్యంత ప్రతిష్టాత్మకమైన డిజైన్ వేదికల్లో ఒకటైన వెనిస్ బిన్నెలేలో చోటు సంపాదించాయి. సియోల్లో ఒక అడుగు ముందుకు వేసి మైసిలియంతో చేసిన ఆర్ట్వర్క్ని ప్రదర్శనకు ఉంచారు. దానికి కూడా మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఇండోనేషియాలోని ఎంవైసీఎల్ కంపెనీతో పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మైసిలియం ఉత్పత్తిదారుల్లో ఒకటి.
ఫర్నిచర్కు మించి..
‘‘మా లక్ష్యం ఫర్నిచర్ అమ్మడమే మాత్రమే కాదు. మనుషుల ఆలోచనలను మార్చడం కూడా. మాకు వైరల్ ప్రొడక్ట్స్ వద్దు. రైతులను ఇందులో భాగస్వాములను చేస్తున్నాం. వాళ్ల నుంచి వ్యర్థాలను సేకరించి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాం” అంటోంది భక్తి.
