
22 నుంచి ఆన్లైన్లో అడ్వాన్స్ రిజర్వేషన్
రద్దీని బట్టి మరిన్ని పెంచుతామన్న ఆర్టీసీ
హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 3 వేల స్పెషల్ బస్సులు నడుపనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. ఇప్పటికే ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి 281 బస్సులను నడిపామని, 22 నుంచి మరిన్ని పెంచుతామని తెలిపింది. 22 నుంచి 24 వరకు 2,034 బస్సులు నడుపుతామని చెప్పింది. 24న 614 స్పెషల్ బస్సులను అదనంగా నడుపుతామని వెల్లడించింది. ప్రయాణికుల రద్దీ పెరిగితే దానికి తగ్గట్టు మరిన్ని బస్సులను పెంచుతామని పేర్కొంది. 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు www.tsrtconline.in ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎంజీబీఎస్, జూబ్లీ బస్స్టేషన్, దిల్సుఖ్నగర్, కేపీహెచ్బీ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్తోపాటు సిటీలోని శివారు ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడుపుతామని చెప్పింది. ఎంక్వైరీకి కోసం ఎంజీబీఎస్లో 833093357, జేబీఎస్లో 04027802203, దిల్సుఖ్నగర్లో 040 23747297, కేపీహెచ్బీ 9490484232, ఈసీఐఎల్ 986627079 ప్రత్యేక నంబర్లను ఏర్పాటు చేసినట్టు చెప్పింది. కాగా, ఆర్టీసీ సమ్మె కారణంగా పోయినేడాది దసరాకు స్పెషల్ బస్సులను నడుపలేదు. ఇప్పుడు కరోనాతో బస్సులు ఏ మేర నిండుతాయోనన్న అనుమానం ఉందని, బస్సుల్లో రద్దీని బట్టి చార్జీలపై నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి చెప్పారు. ఏపీతో ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ కుదరకపోవడంతో అక్కడికి బస్సులు నడపట్లేదు. అయితే, ఏపీ మీదుగానే బెంగళూరుకు వెళ్లాల్సి ఉండడంతో.. బెంగళూరుకూ బస్సులను ఆర్టీసీ నడపట్లేదు. లాంగ్రూట్ వెళ్లే బస్సు సర్వీసుల చార్జీలను 50 శాతం పెంచుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది.
For More News..