తుక్కుగూడ, వెలుగు: తుక్కుగూడ మున్సిపాలిటీ వరకు రూ.6 వేల 600 కోట్లతో మెట్రో తెచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాలలో రూ. 20 లక్షలతో ముదిరాజ్ భవన నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆమె ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. మెట్రో వస్తే తుక్కుగూడ రూపురేఖలు మారిపోతాయన్నారు. కుల, చేతి వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. ముదిరాజ్లకు ఓఆర్ఆర్ పక్కన అతి ఖరీదైన స్థలంలో భవనం నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.