ఎలక్షన్లకు ముందే టికెట్ల లొల్లి

ఎలక్షన్లకు ముందే టికెట్ల లొల్లి
  •     జడ్చర్లలో ప్రధాన పార్టీల నుంచి టికెట్ల కోసం ఇద్దరు చొప్పున పోటీ
  •     టికెట్​ తమకే వస్తుందంటూ ధీమా
  •     పబ్లిక్​ దగ్గరయ్యేందుకు యాత్రలకు ప్లాన్​

మహబూబ్​నగర్, వెలుగు : ఎన్నికల వేళ రూలింగ్, అపోజిషన్​ పార్టీల లీడర్ల మధ్య టికెట్ల లొల్లి నడుస్తోంది. ఈసారి పోటీలో ఉండేది మా లీడరే అంటూ ఓ వర్గం వారు.. కాదు కాదు.. మా సార్​కే టికెట్​ కన్ఫాం అయిందంటూ మరో వర్గం నేతలు ప్రచారం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మహబూబ్​నగర్​ జిల్లాలో ప్రస్తుతం రాజకీయం​స్తబ్దుగా ఉంది. జడ్చర్ల నియోజకవర్గంలో మాత్రం హాట్​హాట్​ టాపిక్స్​ నడుస్తున్నాయి. జడ్చర్ల బీఆర్ఎస్​ టికెట్ విషయంలో మాజీ మంత్రి, సిట్టింగ్​ ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, టీటీడీ బోర్డ్​ మెంబర్​ మన్నె జీవన్​రెడ్డి మధ్య పోటీ నడుస్తున్నట్లు పబ్లిక్​ చర్చించుకుంటోంది. హైకమాండ్​ కూడా జీవన్​రెడ్డికి కమిట్​మెంట్ ఇచ్చినట్లు ఆయన వర్గం చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గ్రౌండ్​ లెవల్​లో కార్యకర్తలు, ప్రజలతో అటాచ్​మెంట్​ లేకపోవడంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తునట్లు తెలిసింది. వచ్చే వారం నుంచి పబ్లిక్​లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్​ చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. 

ఇప్పటికే మండల, గ్రామ స్థాయి లీడర్లను కలిసేందుకు ప్రత్యేకంగా వారితో ఇతర ప్రాంతాల్లో సమావేశం అవుతున్నట్లు సమాచారం. త్వరలో సీఎం కేసీఆర్​ ప్రకటించే ఫస్ట్​ లిస్ట్​లో కూడా జీవన్​రెడ్డి పేరు ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఎంఎస్ఎన్​ డైరెక్టర్​ పదవిని కూడా జీవన్​రెడ్డి వద్దనుకున్నట్లు సమాచారం. అయితే, సిట్టింగ్​ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మంత్రి కేటీఆర్​, ఎమ్మెల్సీ కవితతో సన్నిహిత సంబంధాలున్నాయి. జడ్చర్ల అసెంబ్లీ టికెట్​ను ఆయన్ను కాదని జీవన్​రెడ్డికి ఇవ్వడం సాధ్యపడుతుందా? అనే చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ హైకమాండ్​ జీవన్​రెడ్డికి అసెంబ్లీ టికెట్​ ఇస్తే, లక్ష్మారెడ్డికి మహబూబ్​నగర్​ పార్లమెంట్​ టికెట్​ ఇచ్చి బుజ్జగిస్తుందా? అనే విషయంపై పబ్లిక్​ చర్చించుకుంటోంది.

బీజేపీలోనూ అంతే..

బీజేపీ నుంచి ఆర్.బాలా త్రిపురసుందరి టికెట్​ ఆశిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజలను కలుస్తూ, పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్​ చేస్తున్న స్కీంల గురించి వివరిస్తున్నారు. రూలింగ్​ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పబ్లిక్​కు అవగాహన కల్పిస్తున్నారు. కానీ, జిల్లా స్థాయి కేడర్​ ఈమెకు సహకారం అందించడం లేదు. పదవి లేకుండా నియోజకవర్గంలో ఎలా తిరుగుతారు? అంటూ అడ్డుకుంటున్నారు. ఇటీవల బీజేపీ హైకమాండ్​ ప్రకటించిన  రాష్ట్ర కార్యవర్గంలో ఈమె పేరు ఉన్నా, ఓ లీడర్​ సైలెంట్​గా పేరును డిలీట్​ చేయించారనే టాక్  పాలమూరులో చక్కర్లు కొడుతోంది. దీనికితోడు ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్​ పోటీ చేస్తారని ఆ పార్టీకి చెందిన జిల్లా స్థాయి లీడర్లు ప్రచారం చేస్తున్నారు. 

కాంగ్రెస్​లో హోరాహోరీ..

ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ పార్టీ టికెట్​ కోసం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్​ పోటీ పడుతున్నారు. రాహుల్​గాంధీ చేపట్టిన ‘భారత్​ జోడోయాత్ర’, ఇటీవల సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్​మార్చ్’ నియోజకవర్గంలో విజయవంతానికి అనిరుధ్  కృషి చేశారు. దీంతో ఆయనపై హైకమాండ్​ సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. హస్తిన నుంచి కూడా టికెట్​ కన్ఫాం చేసినట్లు ఆయన వర్గం లీడర్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అనిరుధ్​ ప్రజలకు దగ్గరయ్యేందుకు నెల రోజులుగా ‘ప్రజాహిత పాదయాత్ర’ పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 

ఈ పాదయాత్రకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి కూడా సపోర్ట్​ చేసి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇదే స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్​ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ ఈక్వేషన్స్​ ఆధారంగా టికెట్​ తనకే వస్తుందనే ధీమా​లో ఉన్నారు. త్వరలో ‘రైతు భరోసాయాత్ర’కు ప్లాన్​ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇందు కోసం ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.