
- భార్యాభర్తలు కలిసి యువకుడి దారుణ హత్య
- వివాహేతర సంబంధమే కారణం
- పోలీసుల ఎదుట లొంగిపోయిన హంతకులు
- నోముల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత
కండ్లలో కారం కొట్టారు.. కళ్లు మండుతుండడంతో హాహాకారాలు పెడుతున్న యువకుడిపై పిడిగుద్దులు కురిపించారు.. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పారతో శరీరాన్ని గడ్డిని చెక్కినట్లు చెక్కారు.. అంతటితో ఆగలేదు.. మర్మాంగాలను వడేసి నరకం చూపించారు.. సొమ్మసిల్లిన ఆ యువకుడిని బయటకు లాగి ఇంటి ముందు చెట్టుకు కట్టేసి కాళ్లు విరగొట్టారు.. నానా చిత్రహింసలు పెడుతూ ప్రాణం తీశారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో జరిగింది.
నకిరేకల్, వెలుగు: ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో యువకుడిని దారుణంగా హతమార్చారు. సదరు మహిళ కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా దాడి చేయడంతో యువకుడు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. నోముల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్య(34) అనే యువకుడు తన తల్లితో కలిసి గ్రామంలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
అదే గ్రామానికి చెందిన ధనమ్మ అనే వివాహితతో ఎనిమిదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరిగాయి. పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. గతేడాది అక్టోబర్లో ధనమ్మ ఆమె భర్త నాగరాజు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా జానయ్య జైలుకు వెళ్లాడు. కొన్ని నెలలు ఆమెకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం (june 20) మధ్యాహ్నం మరోసారి ధనమ్మ ఇంటికి జానయ్య వెళ్లాడు. ఆ సమయంలో నాగరాజు ఇంట్లో లేడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
విషయాన్ని ధనమ్మ కూతురు తన తండ్రి నాగరాజుకు ఫోన్ చేసి చెప్పింది. నాగరాజు ఆవేశంతో ఇంటికి వచ్చాడు. ఆ తరువాత నాగరాజు, ధనమ్మ, కూతురుతో పాటు ధనమ్మ తల్లి జానయ్య ఇంటికి వెళ్లారు. విచక్షణా రహితంగా కొట్టారు. మర్మాంగాలు, చాతిపై పిడిగుద్దులు గుద్ది పత్తి చేనులో వాడే గడ్డి పారతో శరీర భాగాలను చెక్కారు. అనంతరం ఇంటి ముందు చెట్టుకు చీర, తాళ్లతో కట్టేశారు. కళ్లల్లో కారం కొట్టి మళ్లీ కొట్టారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 2:30 గంటల వరకు కొట్టడంతో జానయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అంబులెన్స్ లో నకిరేకల్ ప్రభుత్వ ఆసుత్రికి తరలించి, పరిస్థితి విషమంగా ఉండడంతో నల్గొండ ప్రభుత్వ ఆసుత్రికి తీసుకెళ్లగా కొద్దిసేపటికే మృతిచెందాడు.
డీఎస్పీ కార్యాలయంలో దంపతుల సరెండర్..
జానయ్యను ఆస్పత్రికి తరలించే సమయంలోనే ధనమ్మ, నాగరాజు నకిరేకల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తాము జానయ్యను కొట్టామని చెప్పి లొంగిపోయారు. వారు నల్లగొండ డీఎస్పీ కార్యాలయంలో సరెండర్ అయినట్లు సమాచారం. జానయ్య తల్లి నర్సింగ్ ప్రమీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం జానయ్య మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని సీఐ రాజశేఖర్ తెలిపారు.
నోముల గ్రామంలో పోలీస్ పికెటింగ్..
జానయ్య మృతితో నోముల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని నిందితుల ఇంటి ఎదుట వేసి ఆందోళనకు దిగుతారని సమాచారం అందడంతో పోలీసులు పికె టింగ్ ఏర్పాటు చేశారు. నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్సైలు సుమారు 50 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం నల్గొండ ఆస్పత్రి నుంచి అంబులెన్స్ లో జానయ్య మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావడంతో బంధువులు మృతదేహాన్ని నిందితుల ఇంటిముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.