కవ్వాల్ లో టైగర్‌ సఫారీ రీస్టార్ట్‌... ఆకట్టుకుంటున్న అటవీ అందాలు, వన్యప్రాణులు

కవ్వాల్ లో టైగర్‌ సఫారీ రీస్టార్ట్‌... ఆకట్టుకుంటున్న అటవీ అందాలు, వన్యప్రాణులు
  • ఫారెస్ట్​, టూరిజం డిపార్ట్​మెంట్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు 

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కవ్వాల్‌ లోనూ టైగర్‌ సఫారీ షురువైంది. మూడు నెలల కింద బంద్‌ కాగా..  ఈ నెల 1 నుంచి తిరిగి మొదలైంది. జన్నారం కేంద్రంగా ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్​అందాలను ఆస్వాదించడానికి అక్టోబర్​ నుంచి జనవరి వరకు అనుకూలంగా ఉంటుంది. అటవీ అందాలను వీక్షించడం మరపురాని అనుభూతిగా మిగుల్చుతుంది. ఏటా ఇదే సీజన్​లో కవ్వాల్​కు పర్యాటకుల రద్దీ పెరుగుతుంది. తెలంగాణ టూరిజం, ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.  

దట్టమైన అడవులు, ఎత్తైన గుట్టలతో పచ్చదనం పరుచుకుని కనువిందు చేస్తోంది. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​పలుచోట్ల వాచ్​టవర్లు నిర్మించింది. ఉడెన్​  బ్రిడ్జిలు, కాటేజీలు ఏర్పాటు చేశారు. అడవిలో చుక్కల జింకలు, కోతులు, కొండెంగలు, అడవిపందులు, దున్నల గుంపులను చూడవచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో అడవి కుక్కలు, చిరుతలు, ఎలుగుబం ట్లు వంటివి కనిపిస్తుంటాయి. సుమారు 300 రకాల పక్షులను కవ్వాల్​ఫారెస్ట్​లో గుర్తించారు. ఏటా నిర్వహించే బర్డ్​వాచ్​ ఫెస్టివల్​కు బర్డ్​లవర్స్​పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.

ఆహ్లాదంగా సాగే జంగిల్​ సఫారీ 

జంగిల్​సఫారీలో విహరిస్తూ కవ్వాల్​అందాలను ఆస్వాదించవచ్చు. తొమ్మిది సఫారీ వెహికల్స్​ఏర్పాటు చేశారు. ఉదయం 6  నుంచి  8.30 వరకు 9.30 నుంచి 11.30 వరకు, సాయంత్రం 3.30 నుంచి 5.30 వరకు సఫారీ ద్వారా అడవిలో తిప్పుతారు. గోండుగూడ బేస్​క్యాంప్​, వాచ్​టవర్, బైసన్ ​కుంట, మైసమ్మకుంట, గనిశెట్టికుంటను చూపిస్తారు. బైసన్​కుంట వద్ద చుక్కల దుప్పులు, అడవిదున్నలు కనిపిస్తాయి. అక్కడే ఉన్న ఎన్విరాన్​మెంటల్ స్టడీ సెంటర్​లో జంతువుల ఎముకలు, పుర్రె భాగాలు చూడొచ్చు.  దట్టమైన అడవిలో సుమారు 20 కిలోమీటర్లు జంగిల్​సఫారీ ఆహ్లాదకరంగా సాగుతుంది.  

ప్యాకేజీలు ఇలా..

జంగిల్​ సఫారీ కోసం ఒక్కో వెహికల్​లో ఆరుగురు ప్రయాణించవచ్చు. సోమవారం నుంచి గురువారం వరకు ట్రిప్​కు రూ.3,500, శుక్ర, శని, ఆదివారాల్లో ట్రిప్​కు రూ.4వేలు చార్జ్ చేస్తారు. అదనంగా ఎక్కితే ఒక్కొక్కరికి రూ.500 ఎక్స్​ట్రా చెల్లించాలి. వీకెండ్స్​లో  టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. జన్నారంలో టూరిజం డిపార్ట్​మెంట్​ఆధ్వర్యంలో హరిత కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. 

సోమవారం నుంచి గురువారం వరకు నాన్​ఏసీ రూమ్​కు రూ.1,155, ఏసీ రూమ్​కు రూ.1,890, డార్మెటరీ నాన్​ఏసీ రూ.2,500 చార్జ్ చేస్తారు. శుక్ర, శని, ఆదివారాల్లో నాన్​ ఏసీకి రూ.1,260, ఏసీకి 2,100, డార్మెటరీ నాన్​ ఏసీ రూ.3వేలు చెల్లించాలి. వీకెండ్స్​లో సందర్శించేవారు వారం రోజుల ముందే ఆన్​లైన్​లో బుక్​చేసుకోవాలి. వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ 9440337315, 7382619071, టూరిజం డిపార్ట్​మెంట్​ 7981662513.