సీజన్ మారినప్పుడు ముందుగా వచ్చే ఆరోగ్య సమస్య జలుబు. ఈ సమస్యను త్వరగా దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వీటి వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. జలుబు.. వచ్చిందంటే చాలు.. ఓ పట్టాన వదలదు. ఓ సామెత ఉంది. జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారంరోజుల్లో తగ్గుతంది. వేసుకోకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందని చెబుతారు. అంటే.. జలుబు వస్తే ట్యాబ్లెట్స్ వేసినా.. వేయకపోయినా అది తగ్గాల్సిన టైమ్లోనే తగ్గుతుంది. జలుబు వచ్చిందంటే చాలు.. దీంతో పాటే తలనొప్పి, దగ్గు, తుమ్ములు ఒకదాని తర్వాత మరొకటి ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలా ఇబ్బందులు పెట్టే జలుబుని కేవలం అతి తక్కువ సమయంలోనే తగ్గించే ఇంటి చిట్కాలు చూద్దాం.
చిన్న చిన్న చిట్కాలతో దగ్గు, జలుబు తగ్గించుకునే ప్రయత్నం చేయాలే తప్ప, ఏ మందులు పడితే ఆ మందులు వాడకూడదని, అలా వాడితే ఆ మందులను ఉపయోగించిన ప్రభావం శరీరంపై ఉంటుందని అంటున్నారు. శరీరాన్ని మందులు ముఖ్యంగా యాంటీ బయాటిక్స్ వీక్ చేస్తాయని చెబుతున్నారు.
- జలుబు చేసినప్పుడు సాధారణంగా నీటిని అలానే తాగకూడదు.. వేడి చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు నుంచి కాస్తా ఉపశమనం ఉంటుంది.
- వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది.
- వానలు పడుతున్నప్పుడు రెండు రోజులకొకసారి నీటిలో దాల్చినపొడి కలిపి తాగాలి.
- రెగ్యులర్గా అల్లంతో చేసిన టీ తాగడం అలవాటు చేసుకోండి.
- రెండు మూడు గంటలకు ఓసారి జలుబు తగ్గేవరకూ లేత దానిమ్మ ఆకులని నలిపి వాసన చూడాలి.
- జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది.
- వామాకు దంచి దానిలో కాస్తా కర్పూరాన్ని కలిపి ఆ వాసన చూడాలి.
- వేడినీటిని మరిగించి అందులో అల్లం ముక్కలు , వేసి నిమ్మరసం, తేనె , పుదీనా ఆకులు వేసి తాగితే ఉపశమనం లభిస్తుంది.
- తులసి ఆకులు, రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగితే జలుబు తగ్గుతుంది.
- పసుపును వేడి సూప్లో కలిపి తాగాలి
- ఓ కప్పు నీటిలో స్పూన్ బార్లీ గింజలను వేసి మరిగించి వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తాగాలి
- వామును నమలి ఆ రసాన్ని మింగడం వల్ల దగ్గు దూరం అవుతుంది.
- వేడివేడి సూప్స్ తాగడం వల్ల ఊపరితిత్తుల్లో చేరిన శ్లేష్మం తగ్గుతుంది.
- వెల్లుల్లి, అల్లం వేసి తయారు చేసిన వెజిటేబుల్ సూప్ తాగినా మంచి ఫలితం ఉంటుంది.
- ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతుంది.
- ఆర్గానిక్ బెల్లం, అల్లం, మిరియాలు, పిప్పళ్లు వీటన్నింటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఆవిరి పట్టడం..జలుబు చేసినప్పుడు ఆవిరిపట్టడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. దీని వల్ల మూసుకుపోయిన ముక్కురంధ్రాలు తెరుచుకుంటాయి. చాలా రిలీఫ్గా ఉంటుంది.
పసుపు పాలు.. వేడి పాలల్లో కాసింత పసుపు కలిపుకుని తాగండి. ఈ చిట్కా రాత్రి వేళల్లో బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. పసుపులోని యాంటీ బయాటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తుంది.
జలుబుకి పాటించే చిట్కాలు..
- జలుబు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది. కానీ, అలా కాకుండా పని చేయడం, ఆఫీసులకు వెళ్లడం చేస్తే మీకు జలుబు ఎక్కువ అవుతుంది. మీ వల్ల వేరే వారికి ఆ సమస్య మొదలవుతుంది.
- అదే విధంగా జలుబు ఉన్నప్పుడు కర్చీఫ్ని క్యారీ చేయాలి. దగ్గు, తుమ్ములు వేధిస్తున్నప్పుడు కర్చీఫ్ని అడ్డు పెట్టుకుని చేస్తే మంచిది. దీని వల్ల ఇతరులకి జలుబు రాదు.
- చల్లని ప్రదేశంలో అస్సలు ఉండకూడదు. దీని వల్ల జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
- ఏసీల కింద ఉండడం, పనిచేయడం చేయొద్దు.
- జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చల్లని పదార్తాలు తినొద్దు.
- బ్రెడ్, బిస్కెట్స్, మైదా పిండితో చేసిన ఐటెమ్స్ తినకుండా ఉండడం మంచిది.
- చల్లని ఐస్ క్రీమ్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.
- చల్లని వాతావరణంలో తిరగకూడదు.
- ముఖ్యంగా చెవులని కవర్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే తలనొప్పిని దూరం చేసుకోవచ్చు.
- తలస్నానం చేసినప్పుడు త్వరగా ఆరడానికి డ్రయ్యర్స్ వాడడం మంచిది. లేకపోతే తల తడిగా ఉండి జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది