ప్రత్యేక విమానంలో.. అయోధ్యకు తిరుమల లడ్డూలు

ప్రత్యేక విమానంలో.. అయోధ్యకు తిరుమల లడ్డూలు

అయోధ్యకు  తిరుమల శ్రీవారి లడ్డూలు చేరుకున్నాయి. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో రాముడి కోసం ఆభరణాలు, కానుకలు, ప్రసాదాలు అయోధ్యకు చేరుతున్నాయి .తిరుపతి నుంచి  అయోధ్యకు ప్రత్యేకంగా తయారు చేసిన శ్రీవారి లడ్డూలు చేరాయి. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌ ద్వారా అయోధ్యకు తరలించారు.

అయోధ్యలో శ్రీరామ చంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలిని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా లక్ష లడ్డూలను తయారు చేసి.. నిన్న ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి పంపించారు. వీటినే 22వ తేదీన అయోధ్యలో భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన ఈ లడ్డూలను ఏరో గ్రూప్ సహాయంతో చాపర్ ద్వారా అయోధ్యకు పంపించినట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు

అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీ రామ‌చంద్రుల‌ విగ్రహప్రతిష్ట, శ్రీ‌రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సంద‌ర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష చిన్న లడ్డూల‌ను శ్రీ‌వారి ప్రసాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేప‌ట్టింది. ఇందుకోసం గురువారం(జనవరి 18)  తిరుమ‌లలోని శ్రీ‌వారి సేవాస‌ద‌న్‌-1లో శ్రీ‌వారి సేవ‌కులు ఒక్కో క‌వ‌ర్‌లో రెండు చిన్న ల‌డ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. ఈ విధంగా మొత్తం 350 బాక్సుల‌ను సిద్ధం చేశారు. 350 మంది శ్రీ‌వారి సేవ‌కులు ఈ సేవ‌లో పాల్గొన్నారు. దాదాపు 3 వేల కేజీల బరువు ఉన్న ఈ లడ్డూలను విమానంలో అయోధ్యకు పంపారు.

Also Read :  నిజాం గ్రౌండ్స్ లో అయోధ్య ప్రత్యక్షప్రసారం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. భక్తుల నుంచి భారీ డిమాండ్‌ ఉంటుంది.. అయితే, ఇప్పుడు అయోధ్యకు చేరుకున్నాయి శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన లడ్డూలు.. దేశమంతా రామనామంతో మారుమ్రోగనున్న వేళ.. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్.. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది.