తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్.. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం జనవరి 16 వతేదీ ఘనంగా జరగనుంది. అదే రోజున గోదా పరిణయోత్సవం కూడా నిర్వహించనున్నారు. గోదా పరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ మఠం నుంచి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా.. శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపజేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు.
ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
సంక్రాంతి సందర్భంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 14న భోగితేరు, 15న మకరసంక్రాంతి పర్వదినాలు జరుగనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. జనవరి 14న భోగి పండుగ రోజున సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారు.
అదేవిధంగా, జనవరి 17న పార్వేట ఉత్సవం జరుగనుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేటమండపానికి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు ప్రారంభం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు ఆదివారం(జనవరి 8) ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వరకు జరుగనున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మాడ వీధులు, చిన్నబజారు వీధి, శ్రీ కోదండరామాలయం మాడ వీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకున్నారు.
అక్కడ అమ్మవారికి అభిషేకం, ఆస్థానం చేపట్టారు. ఆండాళ్ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.