
వరస సెలవులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. స్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని.. భక్తులు ఓపిగ్గా ఉండాలని కోరుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. వీకెండ్ తోపాటు మూడు రోజులు సెలవులు కావటంతో.. ఒక్కసారి రద్దీ పెరిగినట్లు చెబుతున్నారు అధికారులు. అదే విధంగా ఇటీవలే సర్వదర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగిందని ప్రకటించారు అధికారులు.
ప్రస్తుతం తిరుమల కొండపై.. ఏప్రిల్ 15వ తేదీ శనివారం మధ్యాహ్నానికి 70 వేల మందిపైనే భక్తులు ఉన్నారని.. 12 కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వెల్లడించారు అధికారులు. 300 రూపాయల టికెట్లు, ఇతర సేవా టికెట్లపై దర్శనం మూడు నుంచి నాలుగు గంటల్లోనే పూర్తవుతుందని.. తిరుపతి నుంచి తిరుమల కొండకు నడిచి వచ్చే భక్తులు ఇచ్చే సర్వదర్శనం టోకెన్లపై దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని వెల్లడించారు అధికారులు.
ఎండాకాలం కావటంతో భక్తుల సౌకర్యార్ధం చలవ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నామని.. నిరంతరం మంచినీళ్లు, మజ్జిగ అందిస్తున్నట్లు వివరించారు అధికారులు. రాబోయే వారం, పది రోజుల్లో సెలవులు వస్తున్నాయని.. భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని.. అందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు అధికారులు.