తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 9వ తేదీన బుధవారం ఆడికృత్తిక పర్వదినం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈరోజు ( ఆగస్టు 9) సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. స్వామివారిని మంగళవారం (ఆగస్టు8) 73 వేల 879 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 26 వేల 144 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.