
శిధిలావస్థకు చేరుకున్న ఉస్మానియా భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని గతంలోనే టీఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందన్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. గురువారం ఉస్మానియా హాస్పిటల్ పై మాట్లాడారు ఉద్యోగ సంఘాల నాయకులు బుధవారం కురిసిన వర్షానికి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ జలమయం కావడంతో.. అందులో చికిత్స పొందుతున్న రోగులు, అందులో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా హాస్పిటల్ ని సందర్శించి, నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. కానీ.. కొంతమంది ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకొని కోర్టులను ఆశ్రయించడంతో కోర్టు నిర్ణయాన్ని గౌరవించి ప్రభుత్వ నిర్ణయం అమలు ఆలస్యమవుతుందని భావిస్తున్నామన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అందరం ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఉస్మానియ ఆసుపత్రి ఎంతోమంది ఉన్నతమైన వ్యక్తులకు పురుడు పోసిందని.. నిరుపేద కుటుంబాలకు భరోసానిచ్చిందన్నారు. ఉద్యమకారులకు జీవితాలను ప్రసాదించిందని.. తెలంగాణ ఉద్యమంలో గాయపడిన ఉద్యమకారులకు సేవలందించిందన్నారు. ఉస్మానియాలో భావితరాలకు సేవలందే విధంగా ఆ భవనాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన ఉద్యమకారుల జ్ఞాపకాలు ఉస్మానియ ఆసుపత్రిలో నిగూఢమై ఉన్నాయన్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా బడుగు బలహీన వర్గాలకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం, ఉస్మానియా దవాఖాన నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు ఉద్యోగ సంఘాల నాయకులు.