
- మెడికల్ షాపుల్లోనూ రిజర్వేషన్లు ఇస్తమన్న మంత్రి హరీశ్
- సర్కారు దవాఖాన్లల్ల 16% కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఎస్సీలకు రిజర్వ్
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధును ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని, ఆ పథకం అందాలంటే దళితులైతే చాలని, పేదోళ్లే కావాల్సిన అవసరం ఏమీ లేదని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెడికల్షాపుల్లోనూ దళితులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నామని చెప్పారు. సర్కారు దవాఖాన్లలో కాంట్రాక్ట్ ఏజెన్సీలను 16 శాతం ఎస్సీలకు రిజర్వ్ చేశామని చెప్పారు. మంగళవారం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆఫీసులో ఆయన మాట్లాడారు. ఎస్సీలకు 56 ఆసుపత్రుల్లో డైట్, శానిటేషన్ కాంట్రాక్టులు ఇస్తామన్నారు. వంద బెడ్ల లోపున్న దవాఖానను ఒక కేటగిరీగా, వంద బెడ్ల కన్నా ఎక్కువున్న ఆసుపత్రిని మరో కేటగిరీగా విభజించామన్నారు. ఎస్సీలకు రిజర్వ్ చేసే ఆసుపత్రులను డ్రా ద్వారా నిర్ణయించామన్నారు. వీటికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. ఎస్సీ యువతకు అవకాశాలు దక్కేలా టెండర్ల రూల్స్ మార్చామన్నారు. సర్కారు దవాఖాన్లలో పరిశుభ్రతను మరింత బాగా చేయడం కోసం ఒక్కో బెడ్ చార్జీని రూ.5 వేల నుంచి రూ.7,500కు ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. అందుకు ఏటా రూ.325 కోట్లను ప్రభుత్వం అదనంగా ఖర్చు చేస్తుందన్నారు. డైట్ చార్జీలనూ రెట్టింపు చేశామన్నారు. దళితులు కేవలం కూలీ పనులకు మాత్రమే పరిమితం కావొద్దన్న ఉద్దేశంతో.. సర్కారు కొలువులు, కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్లు ఇచ్చేలా స్వాతంత్ర్యానికి ముందే ప్రభుత్వానికి అంబేద్కర్ లేఖ రాశారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.