టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో టీమ్మేట్స్కు రోహిత్ సూచన
మొహాలీ: టీమిండియా ప్లేయర్లంతా తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలని కెప్టెన్ రోహిత్ శర్మ పిలుపునిచ్చాడు. టీ20 వరల్డ్ కప్ టీమ్ను ఇప్పటికే సెలెక్ట్ చేసిన నేపథ్యంలో జట్టులో చోటు గురించి ఆలోచించకుండా మెగా టోర్నీకి ముందు జరిగే ఆరు టీ20ల్లో (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) స్వేచ్ఛగా ఆడాలని సూచించాడు. ప్లేయర్లు తమ ఆటలోని కొత్త కోణాలను అన్వేషించాలని ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముంగిట ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ అభిప్రాయపడ్డాడు. ‘నేను జట్టులో భద్రతను తీసుకురావాలనుకున్నా. అందుకే టీ 20 ప్రపంచకప్ టీమ్ కంటే ముందే ఈ రెండు సిరీస్లకు (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) జట్టును ప్రకటించాం. ఆసియా కప్లో కూడా దాదాపు ఇదే జట్టుతో ఆడాము. రాబోయే ఆరు మ్యాచ్ల్లో మేం డిఫరెంట్ స్టైల్స్లో ఏం సాధించగలమో ట్రై చేస్తూ ఉండాలనుకుంటున్నాం. కొత్త విషయాలను ట్రై చేయడానికి లిమిట్ ఏమీ ఉండదు. అలా చేసేవాళ్లను మేం ఎంకరేజ్ చేస్తాం. ఉదాహరణకు రివర్స్ స్వీప్ ఆడని ఎవరైనా ఇప్పుడు దాన్ని ప్రయత్నించొచ్చు. మ్యాచ్లో రివర్స్ స్వీప్ షాట్లు కొట్టొచ్చు. మీకు (ప్లేయర్లు) సౌకర్యంగా లేని పనులను చేసి ఏం జరుగుతుందో తెలుసుకోండి. వరల్డ్ కప్లోకి వెళ్తున్నప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ మీ దగ్గర సమాధానాలు ఉండాలి. బౌలర్లు కూడా కొత్త ప్రయోగాలు చేయొచ్చు. వాళ్లు యార్కర్ లేదా బౌన్సర్తో తమ స్పెల్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించొచ్చు’ అని రోహిత్ అభిప్రాయపడ్డాడు.
దూకుడు కొనసాగిస్తాం
గత టీ20 వరల్డ్ కప్లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన తర్వాత టీమిండియా తన బ్యాటింగ్ అప్రోచ్ను మార్చుకొని దూకుడుగా ఆడుతోంది. ఇకపై కూడా ఇదే పంథాను కొనసాగిస్తామని రోహిత్ స్పష్టం చేశాడు. ఆరంభంలో వికెట్లు పడితే బ్యాకప్ ప్లాన్ను అమలు చేస్తామని చెప్పాడు. ‘ఏదేమైనా దూకుడుగా ఆడాలని నేను కెప్టెన్సీ చేపట్టిన కొత్తలోనే స్పష్టం చేశా. ఇన్నింగ్స్ ఆరంభంలో మేం 10/3తో నిలిస్తే ఎలా ఆడాలో.. ఒకవేళ 50/0తో ఉంటే ఏం చేయాలనేదానిపై ప్లేయర్లకు క్లారిటీ ఉంది. ఈ అప్రోచ్ మాకు చాలా నమ్మకం కలిగించింది. దాన్ని కొనసాగిస్తాం. ఆరు మ్యాచ్ల తర్వాత గత పది నెలల పెర్ఫామెన్స్పై సమీక్ష చేసుకుంటాం. వరల్డ్ కప్లో ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయానికి వస్తాం’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
టీ20 వరల్డ్ కప్లో రాహులే ఓపెనర్
టీ20 వరల్డ్ కప్లో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని, విరాట్ కోహ్లీ థర్డ్ ఓపెనర్గా ఉంటాడని రోహిత్ స్పష్టం చేశాడు. అందుకే బ్యాకప్ ఓపెనర్ను ఎంపిక చేయలేదని చెప్పాడు. ‘రాహుల్ టీమ్లో ముఖ్యమైన ప్లేయర్. గత రెండేళ్ల నుంచి అతని పెర్ఫామెన్స్ బాగుంది. తను మాకు మ్యాచ్ విన్నర్’ అని పేర్కొన్నాడు.
టీమిండియా వరల్డ్ కప్ జెర్సీ వచ్చేసింది
టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ ఆదివారం రిలీజ్ చేసింది. మంగళవారం ఆస్ట్రేలియాతో మొదలయ్యే టీ20 సిరీస్లో ఈ జెర్సీతోనే రోహిత్సేన బరిలోకి దిగుతుంది. మెన్స్తో పాటు విమెన్స్ క్రికెటర్లు ఇకపై టీ20ల్లో ఈ జెర్సీని ఉపయోగిస్తారు. కొత్త జెర్సీ ముందు భాగంలో స్కై బ్లూ కలర్ షేడ్స్ ఉండగా.. స్లీవ్స్ మాత్రం రాయల్ బ్లూలో ఉన్నాయి. గతంలో 2007 వన్డే, టీ20 వరల్డ్కప్లో స్కై బ్లూ కలర్ జెర్సీనే ఇండియన్స్ వాడారు.
