ఇవ్వాళ (సెప్టెంబర్ 03) బెండాలపాడులో.. ఇందిరమ్మ గృహప్రవేశాలు.. హాజరుకానున్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి

ఇవ్వాళ (సెప్టెంబర్ 03) బెండాలపాడులో..  ఇందిరమ్మ గృహప్రవేశాలు.. హాజరుకానున్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి

ఇండ్ల ప్రారంభం అనంతరం దామరచర్లలో సభ

భద్రాద్రికొత్తగూడెం/చంద్రుగొండ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడులో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి ముస్తాబయ్యాయి. బుధవారం (సెప్టెంబర్ 03) సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి గ్రామానికి చేరుకొని లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

గృహప్రవేశాలకు సంబంధించి పైలాన్‌‌‌‌ నిర్మాణం సైతం చివరి దశకు చేరుకుంది. కార్యక్రమం అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ కింద ఎంపికైన బెండాలపాడు గ్రామానికి మొత్తం 310 ఇండ్లను మంజూరు చేశారు. ఇందులో 173 ఇండ్లకు ఇప్పటివరకు మార్కింగ్‌‌‌‌ చేయగా... 58 ఇండ్లు స్లాబ్‌‌‌‌ దశలో ఉన్నాయి. 25 ఇండ్లు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. 

గృహప్రవేశం అనంతరం బహిరంగసభ

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మధ్యాహ్నం 2.20 గంటలకు బెండాలపాడు సమీపంలోని దామరచర్లలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌‌‌‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా బెండాలపాడు వెళ్తారు. మధ్యాహ్నం 2.35 నుంచి 2.50 గంటల మధ్య ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు బచ్చల నర్సమ్మ, బచ్చల రమణల చేత గృహ ప్రవేశం చేయిస్తారు. 

తర్వాత 2.50 నుంచి 3.05 గంటల మధ్య ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల పైలాన్‌‌‌‌ ఆవిష్కరించిన అనంతరం 3.15 గంటల నుంచి నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు దామరచర్లలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం మాట్లాడుతారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు మంత్రులు, రాష్ట్ర అధికారులు హాజరుకానున్నారు. దామరచర్లలో జరిగే సభ నుంచే సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి స్థానిక ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.