క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు ఇకలేరు

క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు ఇకలేరు

హైదరాబాద్: తెలుగు సినిమా, టీవీ , రంగస్థల నటుడు రాజబాబు(64) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యతో బాధపడుతున్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. రాజబాబుకు భార్య , ఇద్దరు మగపిల్లలు ,ఒక అమ్మాయి వున్నారు. 
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపుర పేట లో 13 జూన్ 1957లో జన్మించారు.  ఆయన నిర్మాతగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో "స్వర్గం -నరకం ", "రాధమ్మ పెళ్లి " సినిమాలను నిర్మించారు.  రాజబాబు కు వ్యవసాయం చెయ్యడమన్నా, కబడ్డీ ఆడటమన్నా , రంగస్థలం మీద నటించడమన్నా ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ  దేశమంతా తిరిగారు.

దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు రాజబాబును 1995లో  “ఊరికి మొనగాడు ” అన్న సినిమాలో అవకాశం ఇచ్చి సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆనతి కాలంలోనే రాజబాబు ,  సముద్రం, ఆడవారి మాటలకు  అర్ధాలే వేరులే , మురారి ,శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సముద్రం, కళ్యాణ వైభోగం , మళ్లీ రావా ?, శ్రీకారం , బ్రహ్మోత్సవం , భరత్  మొదలైన  62 చిత్రాల్లో  విభిన్నమైన పాత్రలను పోషించారు. 
టీవీ రంగంలో కూడా  48 సీరియల్స్ లో విభిన్నమైన పాత్రల్లో నటించి అందరికీ ఆత్మీయుడయ్యారు.  వసంత కోకిల, అభిషేకం , రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం , చి ల సౌ స్రవంతి ,ప్రియాంక సీరియల్స్  లో పోషించిన పాత్రలు రాజబాబు కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. 2005వ సంవత్సరంలో  "అమ్మ " సీరియల్ లోని పాత్రకు నంది అవార్డు వచ్చింది. తెలుగు దనాన్ని తెరమీద పంచి తెర మెరుగైన రాజబాబు తన పాత్రల ద్వారా ఎప్పటికీ చిరంజీవిగా వుంటారు.