న్యూఢిల్లీ: దేశంలోని ఏడు ముఖ్య నగరాల్లో ఇండ్ల అమ్మకాలు ఈ ఏడాది 31 శాతం పెరిగి దాదాపు 4.77 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ఇది-- ఆల్ టైమ్ గరిష్ట స్థాయి కావడం విశేషం. ధరల పెరుగుదల సగటున 15 శాతం ఉన్నప్పటికీ అమ్మకాలు ఇంతలా ఉండటం గమనార్హం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ గురువారం ఏడు ప్రధాన నగరాల ప్రైమరీ హౌసింగ్ మార్కెట్ వార్షిక డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఇండ్ల విక్రయాలు 2022లో 3,64,870 యూనిట్ల నుంచి ఈ క్యాలెండర్ సంవత్సరంలో 4,76,530 యూనిట్లకు పెరిగాయి. దీనిపై అనరాక్ ఛైర్మన్ అనుజ్ పూరి మాట్లాడుతూ "ప్రపంచవ్యాప్తంగా ఎదురుగాలులు, దేశీయంగా ఆస్తుల ధరలు పెరగడం, వడ్డీ రేట్ల పెంపుదల వంటి సమస్యలను రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటోంది.
అయినప్పటికీ 2023 సంవత్సరం మనదేశ గృహనిర్మాణ రంగానికి మేలు చేసింది. టాప్ 7 నగరాల్లో హౌసింగ్ అమ్మకాలు 2022 నాటి గరిష్ట స్థాయిని దాటాయి. కొత్త లాంచ్లు ప్రస్తుత హౌసింగ్ డిమాండ్కు అనుగుణంగా ఉన్నాయి. మార్కెట్ అనిశ్చితితో పాటు పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, వడ్డీ రేట్లు రెసిడెన్షియల్ అమ్మకాలపై ప్రభావం చూపుతాయి. అయితే డిమాండ్ నిలకడగా ఉంది’’అని పూరీ చెప్పారు. ఎనరాక్ డేటా ప్రకారం, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) టాప్ ఏడు నగరాలలో అత్యధిక అమ్మకాలను సాధించింది. తరువాత స్థానంలో పూణే ఉంది. ఎంఎంఆర్లో విక్రయాలు గత ఏడాది 1,09,730 యూనిట్ల నుంచి ఈ ఏడాది 40 శాతం పెరిగి 1,53,870 యూనిట్లకు చేరుకున్నాయి. పూణేలో ఇండ్ల విక్రయాలు 52 శాతం పెరిగి 57,145 యూనిట్ల నుంచి 86,680 యూనిట్లకు ఎగిశాయి. ఢిల్లీ-–ఎన్సీఆర్లో అమ్మకాలు కేవలం 3 శాతం వృద్ధితో 63,710 యూనిట్ల నుంచి 65,625 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో ఇండ్ల విక్రయాలు 29 శాతం పెరిగి 49,480 యూనిట్ల నుంచి 63,980 యూనిట్లకు చేరుకున్నాయి.
హైదరాబాద్లో 61 వేల యూనిట్ల అమ్మకం
హైదరాబాద్ విక్రయాలు 30 శాతం వృద్ధితో 47,485 యూనిట్ల నుంచి 61,715 యూనిట్లకు చేరుకున్నాయి. కోల్కతాలో విక్రయాలు 9 శాతం పెరిగి 21,220 యూనిట్ల నుంచి 23,030 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నైలో గత క్యాలెండర్ ఇయర్లో 16,100 యూనిట్ల అమ్మకాలు ఉండగా, ఈ ఏడాది 34 శాతం పెరిగి 21,630 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ ఏడు నగరాల్లో 3.43 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. సరఫరా వైపు చూస్తే, 2022లో 3,57,640 యూనిట్లు ఉండగా, 2023లో టాప్ ఏడు నగరాల్లో కొత్త లాంచ్లు 25 శాతం పెరిగి 4,45,770 యూనిట్లకు చేరుకున్నాయి. ఎంఎంఆర్ మార్కెట్ కొత్త సరఫరాలోనూ ముందుంది. ఇక్కడ కొత్త లాంచ్లు గత ఏడాది 1,24,650 యూనిట్ల నుంచి ఈ ఏడాది 27 శాతం పెరిగి 1,57,700 యూనిట్లకు చేరుకున్నాయి. ఇండ్ల ధరలు గతేడాది చదరపు అడుగుకు రూ.6,150 నుంచి సగటున 15 శాతం పెరిగి రూ.7,080కి చేరాయి. ఈ ఏడు నగరాల్లో, ఇండ్ల ధరలు 10-24 శాతం పెరిగాయయి. ప్రధానంగా పెరిగిన ఇన్పుట్ ఖర్చులు, బలమైన డిమాండ్ ఇందుకు కారణాలు. హైదరాబాద్లో ధర గత ఏడాది చదరపు అడుగుకు రూ.4,620 నుంచి ఈ ఏడాది రూ.5,750కి చేరుకుంది.