కరోనా ప్రభావం తగ్గిన వెంటనే టూరిజం అభివృద్ధి

కరోనా ప్రభావం తగ్గిన వెంటనే టూరిజం అభివృద్ధి

 

  • కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి

విజయవాడ: కరోనా ప్రభావం తగ్గిపోయిన వెంటనే అంటే వచ్చే జనవరి 1 నాటికి దేశంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానన్నారు. గురువారం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డికి ఆలయం వద్ద పూర్ణకుంభంతో మేళతాళాలతో మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు ,మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బీజేపీ నాయకులు. దుర్గమ్మ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కిషన్ రెడ్డి. ఈయనతోపాటు దుర్గమ్మను రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూవీర్రాజు, మాధవ్ తదితరులు దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం తీసుకున్నారు. అమ్మ వారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని మంత్రి కిషన్ రెడ్డికి అందజేశారు దేవాదాయ శాఖ కమిషనర్ వాణిమోహన్ ,ఈవో భ్రమరాంబ. 
తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చా 
ఆలయం వెలుపల మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి గా బాధ్యతలు స్వీకరించాక తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానన్నారు. నిన్న తిరు వెంకన్న స్వామిని, ఇవాళ దుర్గమ్మను దర్సించుకున్నానని చెప్పారు. దేశ సంస్క్రుతి, సాంప్రదాయాలను పరిరక్షించాలని మోడీ అకాంక్ష అని, వరంగల్ లో వీరభద్ర దేవాలయాన్ని యునెస్కొ హెరిటేజ్ సెంటర్ గా గుర్తించిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఏపీలో 126 కేంద్రాలున్నాయని, వాటిని  రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలను పిలిచి సిఎస్అర్ ఫండ్ కింద డెవలప్ చేస్తామన్నారు. 
పర్యాటక శాఖ ఛాలెంజ్ తో కూడుకుంది
పర్యాటక శాఖ చాలా ఛాలెంజ్ తో కూడుకున్నదని ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత రెండేళ్లుగా కోవిడ్ తో టూరిజం చాలా దెబ్బతినిందని ఆయన గుర్తు చేశారు. జనవరి 1 నాటికి కోవిడ్ తగ్గగానే టూరిజాన్ని మరింత డెవలప్ చేస్తామన్నారు. భారత్ దర్శన్ ద్వారా చారిత్రాత్మక కట్టడాల విశిష్టతను  అందరికీ తెలిపే విధంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. తెలుగువాడిగా పర్యటక శాఖ ద్వారా నా వంతు సహకారం అందిస్తానన్నారు.  ఏపి, తెలంగాణ రెండు రాష్ట్రాలు ప్రధాని నరేంద్ర మోడీకి రెండు కళ్లు లాంటివని కిషన్ రెడ్డి అభివర్ణించారు. సీఎం జగన్ మర్యాద పూర్వకంగానే ఆహ్వానించారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు వాడికి కేంద్ర‌మంత్రి అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారని స్పష్టం చేశారు. దుర్మమ్మ ఆలయాన్ని టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దేందుకు నా సహకారం అందిస్తానన్నారు. 
తాడేపల్లిలో సీఎం జగన్ తో మర్యాదపూర్వక భేటీ
కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విజయవాడకు వచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. క్యాంపు కార్యాలయంలో  కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో సిఎం జగన్ సమావేశమయ్యారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని భేటీ అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.