దళితుడిని అధ్యక్షుడిని చేసే దమ్ముందా? : రేవంత్ రెడ్డి

దళితుడిని  అధ్యక్షుడిని చేసే దమ్ముందా? :  రేవంత్ రెడ్డి

దేశంలో దళితులకు ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్ కు ఉందని  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దళితులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ, అభిమానానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే ఉదాహరణ అని చెప్పారు. గాంధీభవన్ లో జరిగిన క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న రేవంత్.. దళితుడిని  పార్టీ అధ్యక్షుడిని చేసే దమ్ము మిగతా పార్టీలకు ఉందా అని  ప్రశ్నించారు. 

రాష్ట్రంలో భట్టి విక్రమార్కకు సీఎల్పీ నేతగా ఎన్నుకున్నామని, కానీ  ఆ హోదాను చూసి ఓర్వలేని సీఎం కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారని రేవంత్ ఆరోపించారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. ఇందిరమ్మ హయాంలో 24 లక్షల ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్ సొంతమన్న రేవంత్.. వాటిని ఇప్పుడు బీఆర్ఎస్ గుంజుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి మండలంలో క్రిస్టియన్ స్మశానవాటిక ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల కోసమే రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని రేవంత్ స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారినా వీఆర్ఎస్ గా మారినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపే ఉన్నారని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, మోడీ ఒక్కటేనని, బీఆర్ఎస్ కు ఓటేస్తే పరోక్షంగా మోడీకి వేసినట్లేనని అన్నారు. బీఆర్ఎస్ , బీజేపీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్ని శక్తులు కలిసి రావాలని రేవంత్ పిలుపునిచ్చారు.