కేసీఆర్ సర్కారుకు సమాధే

కేసీఆర్ సర్కారుకు సమాధే
  • రైతుల సమస్యలు తీరాలంటే కాంగ్రెస్​ పవర్​లోకి రావాలె
  • మేం అమలు చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానం ప్రకటిస్తం
  • కేసీఆర్​ సర్కార్​ ఓ పేకమేడ.. అది కూలిపోయే రోజు వచ్చింది
  • నిరుద్యోగం, దళిత, గిరిజన, మహిళా సమస్యలపైనా సభలు పెడ్తం
  • ఎలక్షన్స్​కు ముందు చివరగా రాహుల్​తో ధర్మయుద్ధ సభ
  • మా మధ్య విభేదాలు లేవు.. అవి భిన్నాభిప్రాయాలు మాత్రమే
  • ‘వీ6-వెలుగు’ఇంటర్వ్యూలో పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: వరంగల్ సభతో కేసీఆర్​ సర్కారుకు సమాధి కడ్తామని, కాంగ్రెస్​ సత్తా చూపిస్తామని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో వరంగల్​లో ​రైతు సంఘర్షణ సభ పెట్టినం. టీఆర్​ఎస్​ సర్కారుకు ఇక మూడినట్లే. కేసీఆర్​ మోసకారి పాలనను రాష్ట్రంలో ఎవ్వరూ నమ్మడం లేదు. ఏడేండ్ల పాలనలో కేసీఆర్​ కుటుంబం తప్ప బాగుపడిన వాళ్లు ఒక్కరూ లేరు”అని ఆయన అన్నారు. మే 6, 7 తేదీల్లో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో రేవంత్​రెడ్డి ‘వీ6 వెలుగు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

రేవంత్​ ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే..

ఎన్నికలకు ముందు ధర్మ యుద్ధ సభ

కేసీఆర్ సర్కారుకు చావు డప్పు మోగించేందుకే వరంగల్​లో సభ పెట్టాం. 30 ఏండ్లలో ఎన్నడూ జరగని రీతిలో సభను నిర్వహిస్తున్నాం. లక్షలాది మంది రైతులు సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతు సంఘర్షణ సభ తర్వాత నిరుద్యోగులు, మహిళలు, దళిత- గిరిజనులు, బలహీన వర్గాల కోసం వేర్వేరుగా సంఘర్షణ సభలు పెడుతం. వీటన్నింటికీ రాహుల్​ హాజరవుతారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ధర్మయుద్ధ సభ ఏర్పాటు చేసి కేసీఆర్​ సర్కారుకు సమాధి కడుతం.

కేసీఆర్​ విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు

రాష్ట్రంలో రైతులు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. కేసీఆర్​ మోసపూరిత విధానాలతో రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పుల బాధ, నకిలీ విత్తనాలు, గిట్టుబాటు ధర లేకపోవడం లాంటి ఎన్నో ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నారు. వరంగల్​ సభలో రైతుల గోసను ఆవిష్కరించడంతోపాటు మేం అధికారంలోకి రాగానే ఏం చేస్తామో ‘సమగ్ర వ్యవసాయ విధానం’పేరిట డిక్లరేషన్​ అనౌన్స్​ చేయబోతున్నాం. వరంగల్​ సభ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు రాహుల్​ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటాయి. రైతుల సమస్యలు తీరాలంటే కాంగ్రెస్​ పవర్​లోకి రావాలి.

పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు

వరంగల్​ను వేదికగా ఎంచుకోవడానికి ప్రత్యేక కారణముంది. సమ్మక్క, సారలమ్మ, చాకలి ఐలమ్మ, కాళోజీ, ప్రొఫెసర్​జయశంకర్​ లాంటి తెలంగాణ పోరాట యోధుల పురిటి గడ్డ వరంగల్.​ అక్కడి గాలీ, నీరు, నేల తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతిబింబం. వరంగల్​ టీఆర్ఎస్​కు కంచుకోట అనుకుంటున్నారు. దాన్ని బద్దలు కొట్టేందుకే ఈ ప్రాంతాన్ని సభ కోసం ఎంచుకున్నాం. సభ తర్వాత కేసీఆర్​ గద్దె కుప్పకూలడం ఖాయం. కేసీఆర్​ సర్కారు పేకమేడ లాంటిది. దాన్ని తన్నేటోడు లేకనే ఆయన ఇంకా కుర్చీలో ఉన్నాడు. అది కూలిపోయే రోజు వచ్చింది

పర్మిషన్​ ఇవ్వకున్నా ఉస్మానియాకు వెళ్లి తీరుతం

ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్​ గాంధీ వచ్చే విషయంలో కేసీఆర్​ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఉస్మానియా గడ్డకు రాహుల్​ వస్తే స్వాగతించి.. యూనివర్సిటీ అణువణువూ ఆయనకు చూపించాల్సిన బాధ్యత కేసీఆర్​పై ఉంటుంది. కేసీఆర్​కు రావడం ఇష్టం లేకపోతే కేబినెట్​లో కొందరిని పంపి ఉస్మానియా వైభవాన్ని రాహుల్​కు వివరించడం రాష్ట్రానికే గర్వకారణమవుతుంది. కానీ కేసీఆర్​ చౌకబారు, సంకుచిత ఆలోచనలు చేస్తున్నారు. రాహుల్ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం లేదు. విద్యార్థుల అరెస్టులతో బలప్రయోగం చేయాల్సిన అవసరం లేదు. విద్యార్థుల కోరిక మేరకే మేం రాహుల్​ ఉస్మానియా యూనివర్సిటీ విజిట్​ ప్లాన్​ చేశాం. పర్మిషన్​ ఇవ్వకపోయినా ఓయూ వెళ్లి తీరుతాం.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం

సీఎం కేసీఆర్​ డిసెంబర్​లో సర్కారును రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారని మాకు సమాచారం ఉంది. దానికి తగినట్లుగా మేం ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డాం. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని రాహుల్​ చెప్పారు. వీలైతే ఇంకో మూడు నెలల ముందే ప్రకటిస్తాం. అభ్యర్థులను ప్రకటించేందుకు మాకు ఎక్కువ సమయం అవసరం లేదు. కేసీఆర్​ కదలికలను బట్టి మేం నిర్ణయాలు తీసుకుంటాం. 

పొత్తులపై ఏఐసీసీదే నిర్ణయం

సునీల్​ కనుగోలు కాంగ్రెస్​తో పని చేస్తున్నారు. ఆయనను ఏఐసీసీ నియమించింది. ఆయన ఇక్కడి వ్యవహారాలను నేరుగా రాహుల్​తో మాత్రమే షేర్​ చేసుకుంటారు. అందుకే మాకు ఆయన ఏం చేస్తున్నారో తెలియదు. పీకే కాంగ్రెస్​లో చేరకపోవడం వల్ల నష్టమేమీ లేదు. ఆయన చేరితే మాతో కలిసి పని చేసేవాడు. కాంగ్రెస్​లోకి ఎవరు వచ్చి చేరుతామన్నా, పార్టీ కోసం పని చేస్తామన్నా ఆహ్వానిస్తాం. రానున్న ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉంటుందనే విషయం మా పరిధిలోని అంశం కాదు. పొత్తుల విషయంలో ఏఐసీసీ ఎట్ల చెబితే మేం దాన్ని ఫాలో అవుతాం. 

కాంగ్రెస్​ పుట్టినప్పటి నుంచి విభేదాలున్నయ్

1885లో కాంగ్రెస్​ పుట్టిన నాటి నుంచి పార్టీలో విభేదాలున్నాయి. కాంగ్రెస్​లో ఎప్పుడైనా భిన్నాభిప్రాయాలు ఉంటాయి తప్ప భేదాభిప్రాయాలు ఉండవు. నెహ్రూ, సుభాస్​ చంద్రబోస్, వల్లభ్​భాయ్​ పటేల్, చివరకు ఆర్ఎస్ఎస్​ స్థాపకుడు హెగ్డేవార్​ కూడా కాంగ్రెస్​లో ఉండేవారు. అంశాలవారీగా విభేదించేవారు. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ సోనియాగాంధీ కూడా జీ–23 లాంటి గ్రూపుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అయినా పార్టీ మనుగడ సాగిస్తోంది. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ నాడు స్వాతంత్య్రం సాధించి తర్వాత ప్రభుత్వాలను నెలకొల్పింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్​ ప్రయాణం ఇలాగే సాగుతుంది. రాష్ట్ర కాంగ్రెస్​లో కూడా భేదాభిప్రాయాలు ఉంటే పరిష్కరించుకుంటాం. ఏదైనా తప్పు చేసినా సవరించుకొని అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. కాంగ్రెస్​ జెండా ఎగరేస్తాం. విభేదాలు టీఆర్​ఎస్, బీజేపీలో కూడా ఉన్నాయి. ఆ పార్టీల నేతలు కూడా ఓపెన్​గా కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్​ ప్రజల కోసం పని చేసే పార్టీ. ఆ క్రమంలో నేతల మధ్య భేదాభిప్రాయాలు చిన్న విషయం.

కేసీఆర్​ కలిసి వస్తామంటే మద్దతు తీసుకుంటం

కేసీఆర్​ రాహుల్​ దగ్గరికి వచ్చి తమ పార్టీని విలీనం చేస్తామని, కాంగ్రెస్​ కోసం పని చేస్తామని చెప్పినా ఆయన మద్దతు తీసుకుంటాం. కాంగ్రెస్​లోకి త్వరలో భారీ వలసలు ఉంటాయి. అన్ని పార్టీల వాళ్లు మాతో టచ్​లో ఉన్నారు. కేటీఆర్​ తమ ప్రధాన ప్రత్యర్థి అని కేఏ పాల్​ అంటున్నారు. తండ్రీకొడుకులు ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడుతారు. కేసీఆర్​ ఒక మెంటల్. కేటీఆర్​ ఒక శుంఠ.

మరిన్ని వార్తల కోసం... 

చారెడు పనికి టీఆర్ఎస్ బారెడు ప్రచారం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడిపై భూ కబ్జా ఆరోపణలు