బీఆర్​ఎస్​లో కబ్జాకోరులు ఎమ్మెల్యేలు అయిర్రు : టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి

బీఆర్​ఎస్​లో కబ్జాకోరులు ఎమ్మెల్యేలు అయిర్రు : టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి
  • మూరెడు లేడు గానీ ఎమ్మెల్యే కిషోర్​ మూసీని మింగిండు
  • కేసీఆర్​ సారాలో సోడా పోసేటోడు మంత్రి అయిండు
  • పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే లింగయ్యను అసెంబ్లీ గేటు కూడా తాకనీయొద్దు
  • మహాయోధులు పుట్టిన గడ్డ మీద మాఫియా రాజ్యమేలుతోంది

నకిరేకల్​ / తుంగతుర్తి / ఆలేరు వెలుగు : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నల్గొండ జిల్లాలో ప్రస్తుతం కబ్జాకోరులు ఎమ్మెల్యేలు గా ఉన్నారని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నకిరేకల్​, తిరుమలగిరి, ఆలేరులో జరిగిన విజయభేరి సభల్లో రేవంత్​ మాట్లాడారు. తెలంగాణ కోసం మంత్రి పదవీ త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టిన ఈ జిల్లాలో ఇసుక దొంగతనం చేసేటోడు, చెరువులు కబ్జా పెట్టెటోళ్లు, భూములు ఆక్రమించుకునేటోళ్లు ఎమ్మెల్యేలుగా ఉండడం శోచనీయమన్నారు. నల్గొండ జిల్లా ఆత్మగౌరవాన్ని బీఆర్​ ఎస్​ ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు.

మూరెడు కూడా లేని తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్​ కుమార్​ మూసీ అంతా మింగేసిండని, హైదరాబాద్​లో ఏ ఇసుక లారీ ఆపి ఎవరిదని అడిగితే  ఆయనదేనని చెప్తారని ఎద్దేవా చేశారు. ఈయన పక్కన ఉన్న మంత్రి జగదీష్​ రెడ్డి కేసీఆర్​కు సమాయానికి సారాలో సోడా పోసేటోడని విమర్శించారు. నిజం రజాకారుల దురాగతాలను తరమికొట్టిన జిల్లాలో కేసీఆర్​ సారాలో సోడే పోసే నాయకులు దాపురించారని అన్నారు. కాం గ్రెస్​ పార్టీకి, కోమటిరెడ్డి బ్రదర్స్​కు నమ్మకం ద్రోహం చేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అసెంబ్లీ గేటు తాకనీయకుండా చేయాలని పిలుపునిచ్చారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతోనే నకిరేకల్​, తుంగతుర్తిలో అభ్యర్థులను పార్టీ ఎంపిక చేసిందని, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సామేలును భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత్​ రెడ్డి కోరారు. తెలంగాణ ఉద్యమకారులైన మందుల సామేలును భారీ మెజార్టీతో గెలిపించి, ఇసుక, దళితబంధు దొంగలకు బుద్దిచెప్పాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి జగదీశ్​ రెడ్డి , తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్​   కుమార్​ ఇద్దరూ కలిసి ఇసుక క్వారీలు పంచుకొని  దోచుకుంటున్నారన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు డిపాజిట్ రాకుండా చేయాలన్నారు.

నాగారంలో మూడు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న జగదీశ్ రెడ్డి రూ. 5వేల కోట్ల ఆస్తి ఎలా సంపాదించాడని వెంకట్​రెడ్డి ప్రశ్నించారు.  మందుల సామేలు మాట్లాడుతూ.. .తుంగతుర్తి నుంచే యుద్ధం మొదలైందని, బీఆర్​ఎస్​ ప్ర భుత్వం బొందల గడ్డ శ్మశాన వాటికలు తప్ప డబుల్ బెడ్​ రూమ్​ ఇళ్లు కట్టించలేదన్నారు. టీఆర్​ఎస్​, బీఆర్​ఎస్​గా ఎప్పుడు మారిందో అప్పుడే బొందల పార్టీగా మారిపోయిందని విమర్శించారు. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే నేతి విద్యాసాగర్​, పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్​ నాయక్​, చెవిటి వెంకన్న యాదవ్​, కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి, అద్దంకి దయాకర్​, పూజర్ల శంభయ్య తదితరులు పాల్గొన్నారు.