
తెలంగాణ వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపించిన కేసీఆర్ చివరకు యువతకు ఆవేదన మిగిల్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షల్లో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఉద్యమ నినాదాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు రేవంత్ సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయారని విమర్శించారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు తీవ్ర నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ విభాగంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం.. గత ఆగస్టులో ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన తీరు చూస్తే కొలువుల భర్తీలో టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో తెలుస్తోందని రేవంత్ అన్నారు.
ప్రిలిమినరీ రాత పరీక్షలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ రెండు ప్రశ్నాపత్రాల్లోనూ... చెరో 7 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సంబంధించి అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ 7 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలుండగా.. వాటికి కొందరికి మాత్రమే మార్కులివ్వడాన్ని తప్పుబట్టారు. అసలు సమాధానం రాయని వారికి సైతం మార్కులు కేటాయించి, మరికొందరికి మార్కులు ఇవ్వలేదని రేవంత్ ఆరోపించారు. ఈ విషయాన్ని అభ్యర్ధులు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకుండా మెరిట్ జాబితాను రూపొందించి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించగా.. అభ్యర్ధులు పేర్కొన్న 7 ప్రశ్నలను తొలగించాలని న్యాయస్థానం ఆదేశించిందని చెప్పారు. కొత్తగా అర్హత సాధించే వారికి ఫిజికల్ ఈవెంట్లలో పాల్గొనే అవకాశమివ్వాలని కోర్టు చెప్పినా ఎటువంటి స్పందన లేదని అన్నారు. టీఎస్ఎల్పీఆర్బీ హెల్ప్ డెస్క్ కు ఫోన్ చేస్తే తీర్పు కాపీ తమకు అందలేదన్న సమాధానం వస్తోందనిచెప్న్నాపారు. ఫలితంగా వేలాది మంది అభ్యర్ధులు మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అభ్యర్ధులు తమ ఆవేదనను ట్విట్టర్ లో కేటీఆర్, డీజీపీలకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి చెప్పారు. సంబంధిత శాఖను చూసే హోం మంత్రి ఉన్నాడా లేడో తెలియదన్నారు. కేసీఆర్ మాత్రం ఇవేమీ పట్టవన్నట్లు బీఆర్ఎస్ అంటూ దేశమంతా తిరుగుతున్నారని విమర్శించారు. హై కోర్టు ఆదేశాల మేరకు ప్రిలిమినరీ పరీక్షలోని 7 ప్రశ్నలను తొలగించి అభ్యర్ధులకు న్యాయం చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక కోసం నిర్వహించే ఫిజికల్ ఈవెంట్లలో మూడింటికి మూడు ఈవెంట్లలో అర్హత సాధించిన వారికి ఏఆర్, టీఎస్ఎస్పీ కేటగిరీ పోస్టుల భర్తీలో అవకాశం కల్పించాలని చెప్పారు. అదే విధంగా ఫిజికల్ ఈవెంట్లలో మూడింటిలో రన్నింగ్ లో అర్హత సాధించి.. మిగతా రెండిటిలో ఏదో ఒక దాంట్లో క్వాలిఫై అయిన వారిని సివిల్ పోస్టుల కోసం పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కోరారు.